Jul 17,2023 08:58

భోపాల్‌ : వందేభారత్‌ రైలుకు పెనుప్రమాదం తప్పింది. భోపాల్‌ నుంచి ఢిల్లీకి వెళుతున్న వందేభారత్‌ రైలులో మంటలు చెలరేగిన ఘటన సోమవారం ఉదయం కుర్వాయిస్టేషన్‌ వద్ద జరిగింది. రాణికమలాపాటి స్టేషన్‌ నుంచి ప్రయాణం మొదలైన తర్వాత కుర్వాయి స్టేషన్‌ వద్ద రైలులోని సీ-14 కోచ్‌ వద్ద మంటలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే లోకోపైలట్‌కు సమాచారం అందించారు. దీంతో రైలును అక్కడే ఆపేశారు. రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక దళం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.