సెన్సెక్స్కు 635 పాయింట్ల లాభం
ముంబయి : వరుసగా ఆరు సెషన్లలో భారీ నష్టాలు చవి చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లకు వారాంతంలో ఎట్టకేలకు ఉపశమనం లభించింది. శుక్రవారం బిఎస్ఇ సెన్సెక్స్ 635 పాయింట్లు పెరిగి 63,783కు చేరింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 190 పాయింట్లు రాణించి 19.047 వద్ద ముగిసింది. ఆసియా, ఐరోపా మార్కెట్లలోని సానుకూలతలకు తోడు ఇప్పటికే పడిపోయిన సూచీల నేపథ్యంలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. హెచ్సిఎల్ టెక్, అదాని ఎంటర్ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఎస్బిఐ, టాటా మోటార్స్, ఐచర్ మోటర్స్, ఒఎన్జిసి, ఎన్టిపిసి తదితర స్టాక్స్ 1.5 శాతం నుంచి 3 శాతం మేర పెరిగి మార్కెట్లకు మద్దతును ఇచ్చాయి. బిఎస్ఇలో మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.7 శాతం, 1.9 శాతం చొప్పున రాణించాయి. పిఎస్యు బ్యాంకింగ్ రంగం 4 శాతం, మీడియా 2.6 శాతం, రియాల్టీ సూచీ 1.9 శాతం చొప్పున పెరిగాయి. సెన్సెక్స్-30లో 27 సూచీలు రాణించాయి.