Oct 08,2022 10:49
  • బడ్జెట్‌లో సుమారు రూ. 35వేల కోట్ల మేర తగ్గొచ్చు : కేర్‌ఎడ్జ్‌ నివేదిక

న్యూఢిల్లీ : దేశంలో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీ బడ్జెట్‌ సుమారు రూ.35 వేల కోట్ల మేర తగ్గొచ్చని కేర్‌ఎడ్జ్‌ నివేదిక పేర్కొంది. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ గణనీయంగా క్షీణించటం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత పెరుగుతున్న ఇన్‌పుట్‌ ఖర్చుల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడవచ్చని అంచనా వేసింది. భారత్‌ ఇప్పటికే ఆహార ద్రవ్యోల్బణంతో పోరాడుతున్నది. ఇలాంటి తరుణంలో దేశ ప్రజలకు అవసరమైన గోధుమలు, బియ్యం లభ్యతపై ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. 2022 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బియ్యం, గోధుమల ఉత్పత్తి ఒక్కొక్కటి ఏడు మిలియన్‌ టన్నులు తగ్గుతుందని నివేదిక అంచనా. '' 2023 ఆర్థిక సంవత్సరం కోసం మెరుగుపర్చబడిన రూ. 2.15 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీ బడ్జెట్‌ దాదాపు రూ. 35 వేల కోట్ల మేర తగ్గే అవకాశం ఉన్నది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఎరువుల ఉత్పత్తికి సంబంధించిన కీలక ముడి పదార్థాల ధరలు చాలా వరకు పెరిగాయి'' అని నివేదిక పేర్కొన్నది. ఎరువుల బడ్జెట్‌లో కొరత ఏర్పడటానికి కారణం సహజవాయువుల ధరలో పెరుగుదల కూడా అని కేర్‌ఎడ్జ్‌ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. అక్టోబర్‌ 1న 40 శాతం పెరుగుదల నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. అలాగే, దేశీయ కరెన్సీ యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే 7 శాతం క్షీణించింది.
           సబ్సిడీ బడ్జెట్‌ 2017 ఆర్థిక సంవత్సరం నుంచి 2020 ఆర్థిక సంవత్సరం వరకు ఏడాదికి రూ. 70వేల కోట్ల నుంచి రూ. 80వేల కోట్ల మధ్యలో ఉండేది. 2021 ఆర్థిక సంవత్సరానికి సబ్సిడీ బడ్జెట్‌లో పెరుగుదల 58 శాతంగా నమోదై రూ. 1.28 లక్షల కోట్లకు చేరుకున్నది. 2022 ఆర్థిక సంవత్సరంలో అది రూ. 1.58 లక్షల కోట్లకు చేరింది. ఎరువుల సబ్సిడీ బడ్జెట్‌ను పెంచకపోతే 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఎరువుల కంపెనీల సబ్సిడీ రాబడులు పెరుగుతాయనీ, ఇది ఈ రంగాన్ని దెబ్బతీస్తుందని అసోసియేట్‌ డైరెక్టర్‌-కార్పొరేట్‌ రేటింగ్స్‌ హార్దిక్‌ షా తెలిపారు. భారత మొత్తం ఎరువుల వినియోగంలో యూరియా 55 శాతం నుంచి 60 శాతం వరకు ఉన్నదని కేర్‌ఎడ్జ్‌ వివరించింది. ఇందులో అమ్మోనియా ప్రధాన ముడి పదార్థం, అమ్మోనియా ధరలు ఆగస్టులో పెరిగాయని పేర్కొన్నది. కాబట్టి, కేంద్రం ఈ విషయంలో ముందు చూపుతో వ్యవహరించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా 2023 ఆర్థిక సంవత్సర్‌ ముగింపు నాటికి ఎరువుల సబ్సిడీ పెంచకపోతే.. ఎరువుల కంపెనీలకు అందాల్సిన మొత్తాలు పెరిగిపోతాయి. ఇది మొత్తం వ్యవసాయరంగాన్నే దెబ్బతీస్తుందని ఆయా సంస్థలు పేర్కొంటున్నాయి.