ప్రజాశక్తి - రేపల్లె (బాపట్ల) : ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటలతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చునని ప్రకృతి వ్యవసాయ రేపల్లె మండల నేచరల్ ఫార్మింగ్ మాస్టర్ ట్రైనర్ ప్రసాద్ తెలిపారు. మండలంలోని ఉప్పూడి గ్రామంలో శుక్రవారం రైతులకు అందించే వరినారుకు ద్రవ జీవామృతం తయారు చేసే విధానం, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ద్రవ జీవామృతంతో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది, పైరు ఏపుగా పెరుగుతుందని వివరించారు. అదే క్రమంలో చీడపీడలను తట్టుకుని వేరు శాతం అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులు అధిక దిగుబడుల కోసం ఎరువులు, క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా వాడుతుండడంతో నేల కలుషితమవుతుందన్నారు. దీంతో దిగుబడులు భారీగా పడిపోతున్నాయని పేర్కొన్నారు. అలాకాకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వలన భూమిలో సారం పెరగడంతో పాటు దిగుబడులు కూడా పెరుగుతాయని తెలిపారు. ఆవు, గేదల పేడ, మూత్రాలతో, పుల్లటి మజ్జిగతో తయారు చేసిన జీవామృతం, కషాయంతో ప్రకృతి వ్యవసాయం చేసి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో నేచరల్ ఫార్మింగ్ మాస్టర్ ట్రైనర్ ప్రసాద్, ప్రాజెక్ట్ రిసోర్స్ పర్సన్ జి.శ్రీనివాసరావు, మండల్ కొర్దేనేటర్ అసిస్టెంట్ సామ్రాజ్యం, ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ వెంకటేశ్వర్లు, కార్తీక్ పాల్గొన్నారు.










