Nov 22,2023 12:35

నరసరావుపేట (పల్నాడు జిల్లా) : నరసరావుపేట ఎకో ఓవర్సీస్‌ కన్సల్టెన్సీ యజమాని హరిబాబును చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇటీవల అమెరికా వెళ్లేందుకు పల్నాడు జిల్లాకు చెందిన హేమంత్‌ వీసా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 16న చెన్నై యూఎస్‌ కాన్సులేట్‌ లో ఇంటర్వ్యూకి హాజరయ్యారు. హేమంత్‌ ధ్రువ పత్రాలను యూఎస్‌ కాన్సులేట్‌ అధికారులు పరిశీలించారు. ఆ పరిశీలనలో హేమంత్‌ వి నకిలీ ధ్రువ పత్రాలుగా గుర్తించారు. హేమంత్‌ పై చెన్నై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు యూఎస్‌ కాన్సులేట్‌ ఫిర్యాదు చేసింది. హేమంత్‌ కి నకిలీ ధ్రువ పత్రాలు ఇచ్చింది నరసరావుపేటకి చెందిన ఎకో ఓవర్సీస్‌ కన్సల్టెన్సీ యజమాని హరిబాబుగా తెలుసుకున్నారు. హేమంత్‌లాగే... మరికొందరు విద్యార్థులకు కూడా నకిలీ ధ్రువపత్రాలను హరిబాబు ఇచ్చినట్లు విచారణలో గుర్తించారు. ఈరోజు హరిబాబును అరెస్టు చేశారు.