Nov 15,2023 15:12

హైదరాబాద్‌ : అధికార ప్రతిపక్ష నేతల నిరసనల ప్రదర్శనలతో పాలకొల్లులో ఉద్రిక్తత నెలకొంది.. రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో పోలీసులు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం 'పాలకొల్లు చూడు' పేరుతో ఎమ్మెల్యే నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పెంకిళ్లపాడు టిడ్కో గృహాల వద్ద వంటావార్పు కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నించారు. దీనికి పోటీగా వైసీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇంజార్జ్‌ గొడాల గోపి కూడా 'నిజం చెబుతాం' పేరుతో కార్యక్రమం చేపట్టారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు స్పందించి ఇరు పార్టీల నాయకులను అడ్డుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడును గఅహ నిర్భందం చేశారు. అయితే, పోలీసుల కన్నుగప్పి ఎమ్మెల్యే ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. పెంకిళ్లపాడు వెళ్లే క్రమంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగి ఎమ్మెల్యే కింద పడ్డారు. అనంతరం ఎమ్మెల్యే రామానాయుడును అరెస్ట్‌ చేసిన పోలీసులు, ఆయనను భీమవరం వైపు తీసుకెళ్లారని టీడీపీ కార్యకర్తలు తెలిపారు.