న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత్ నుంచి రూ.85,000 కోట్ల విలువ చేసే మొబైల్ ఫోన్ల ఎగుమతులు జరిగాయని ఇండియా సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసిఇఎ) వెల్లడించింది. ఉత్పత్తి ప్రోత్సాహక అనుసంధాన పథకం వల్ల ఈ రంగానికి మద్దతు లభించిందని తెలిపింది. స్థూల ఎగుమతుల వృద్థితో పోల్చితే స్మార్ట్ఫోన్ ఎగుమతులు రెట్టిపు అయ్యాయి. ముఖ్యంగా యుఎఇ, అమెరికా, నెథర్లాండ్స్, బ్రిటన్, ఇటలీ దేశాలకు ఎక్కువ ఎగుమతులు జరుగుతున్నాయని ఐసిఇఎ తెలిపింది. భారత మొబైల్ ఎగుమతుల్లో ఈ ఐదు దేశాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది. దేశంలో అమ్మకాలు జరుగుతున్న మొత్తం స్మార్ట్ఫోన్లలో 97 శాతానికి పైగా భారత్లోనే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్ల ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐసిఇఎ తెలిపింది.










