ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్ కంపెనీలను మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ఉద్యోగాల్లో కోతల పర్వం కొనసాగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించే ప్రక్రియను చేపట్టాయి. తాజాగా టెలికాం పరికరాలు తయారు చేసే స్వీడన్కు చెందిన బహుళ జాతి సంస్థ ఎరిక్సన్ సైతం ఈ జాబితాలో చేరింది. ప్రపంచవ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నట్లు ప్రకటించింది.ఉద్యోగుల తొలగింపులకు సంబంధించి ఇప్పటికే ఆ కంపెనీ మెమోలు జారీ చేసింది. తొలగించే ఉద్యోగుల సంఖ్య దేశాన్ని బట్టి మారుతుంటాయని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బోర్జే ఎకోల్మ్ తెలిపారు. ఏయే దేశాల్లో ఎంతమందిని తొలగిస్తున్నదీ ఇప్పటికే కొన్ని దేశాలకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇటీవలే స్వీడన్లో 1,400 ఉద్యోగులను కంపెనీ తొలగించింది. ఆ తొలగింపులకు తాజా ప్రకటన అదనం. అంటే దాదాపు 10 వేల మందికి ఎరిక్సన్ ఉద్వాసన పలికినట్లు లెక్క! భారత్లోనూ ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.










