Jun 26,2023 15:39

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఢిల్లీ నుంచి పోర్టు బెయిర్‌ (అండమాన్‌)కు ఆదివారం వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం వాతావరణం అనుకూలించక విశాఖపట్నం ఎయిర్‌ పోర్టులో అదే రోజు సాయంత్రం అత్యవసర ల్యాండింగ్‌ అయింది. అందులోని ప్రయాణికులను విశాఖలోని ఓ ప్రయివేటు హోటల్‌లో సోమవారం మధ్యాహ్నం వరకూ ఉంచి ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానంలో అండమాన్‌ నికోబర్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి నేరుగా పోర్టుబెయిర్‌కు చేరుకోవాల్సి ఉన్న సమయంలో వర్షం కారణంగా వెనక్కి మరలించి విశాఖ ఎయిర్‌పోర్టుకు విమానాన్ని తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రయాణికులందరూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరినట్టు తెలుస్తోంది.