Nov 22,2023 08:55

ప్రజాశక్తి-ఎంవిపీ కాలనీ (విశాఖ) : భారతరత్న సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు అమోఘం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. ఎంవిపీ కాలనీ ఉషోదయ జంక్షన్‌ వద్ద ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో రాజన్న దొర మాట్లాడుతూ... ఏ వ్యవస్థ అభివృద్ధి చెందినా అది ఇంజనీర్ల గొప్పతనమేనన్నారు. అన్ని వ్యవస్థలకు వెన్నెముక ఇంజనీరీంగ్‌ విభాగమని మోక్ష గుండం స్ఫూర్తి తో ఇంజనీయర్లు అందరు ముందుకు సాగడానికి ఆయన విగ్రహం దోహదం చేస్తుందని అన్నారు. తాను జీసిసీ అభివృద్ధికి ఉద్యోగులు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. సమాజానికి ఇంజనీర్ల సేవలు అవసరం అన్నారు. ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నానని సంస్థ లో ఉద్యోగుల పదోన్నతులకు మంత్రిగా వచ్చిన కొత్తలో నే ఆమోదం ముద్ర వేశామని సంస్థ నిర్మాణాలతో గిరిజనులకు మేలు జరగాలి అని అన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ విభాగం చీఫ్‌ ఇంజనీర్‌, విశాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ ఎస్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ... విశ్వేశ్వరయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. బెంగుళూరు బఅందావన్‌ గార్డెన్స్‌ ను ఆయనే అభివృద్ధి చేశారు అని గుర్తు చేశారు. ఆయన సాంకేతిక విద్యకు నాంది పలికారని ఇంజనీర్లకు విశ్వేశ్వరయ్య ఆదర్శంగా నిలిచారు అని చెప్పారు. సీనియారిటీ సమస్య పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు అని అన్నారు. క్వాలిటీ కంట్రోల్‌ విభాగం కోసం రూ.30 లక్షలు కేటాయించారు అని ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాత్రుడు, డిఈఈ వీ.వంశీ కృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ కాంట్రాక్టర్స్‌ సంఘం అధ్యక్షుడు ఆనంద రావు, సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం విశాఖ, అరకు, పాడేరు, సీతం పేట, పార్వతి పురం డివిజన్‌ ఇంజనీర్లు ఉప ముఖ్యమంత్రి ని ఘనంగా సత్కరించారు.