Mar 28,2023 21:00

హైదరాబాద్‌ : కరోనా ముందు నాటి స్థాయికి వీసా దరఖాస్తుల సంఖ్య చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఆంక్షలను ఎత్తివేయడానికి తోడు పర్యాటకానికి డిమాండ్‌ పెరగడంతో వీసా కోసం దరఖాస్తులు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. విఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి దరఖాస్తుల సంఖ్య పరంగా చూస్తే 2019 కొవిడ్‌ ముందస్తు నాటి దరఖాస్తులలో 95 శాతానికి 2022లో చేరుకుంది. 2021తో పోలిస్తే ఏకంగా 129 శాతం వృద్థి చోటు చేసుకుంది. ''భారత్‌ నుంచి 2022లో మేము భారీ డిమాండ్‌ను చూశాము. అసాధారణ ట్రావెల్‌ సీజన్‌గా ఇది నిలవడంతో పాటుగా డిసెంబర్‌ నెల వరకూ కూడా స్ధిరంగా దరఖాస్తులను చూస్తూనే ఉన్నాము. ఈ వేగం మరింతగా పెరగనుందని అంచనా. ఈ క్రమంలో వీసా అభ్యర్థనలకు సంబంధించి తమ దరఖాస్తులను ముందుగానే పెట్టవలిసినదిగా సూచిస్తున్నాము. తద్వారా చివరి నిమిషంలో ఊహాతీత సంఘటనలను అధిగమించవచ్చు'' అని విఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ సౌత్‌ ఆసియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ప్రబుద్ధ సేన్‌ పేర్కొన్నారు.