ప్రజాశక్తి-పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో లింకు రోడ్లు అంబేద్కర్ విగ్రహం నుండి హైస్కూల్ వరకు డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మండల కార్యదర్శి దేవదాసు డిమాండ్ చేశారు. ఆదివారం డివైఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో నేతలు ఎస్సీ కాలనీలో పర్యటించి సమస్యలను అధ్యయనం చేశారు. ఎస్సీ కాలనీలో డ్రైనేజీల నిర్మాణం లేకపోవడం భారీగా మురికి నీరు చెత్త చేరడం వల్ల ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు సమస్య పరిష్కరించాలని కోరినా ఇప్పటివరకు డ్రైనేజీల నిర్మాణాలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డ్రైనేజీల నిర్మాణం చేయకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు రామన్న, అబ్రహం, తాయప్ప, జీవరత్నం, ఆదెప్ప, ప్రభుదాసు, ప్రభాకర్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.










