Sep 22,2023 15:10

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రయివేట్‌ మెడికల్‌ కాలేజీల్లో వసూలు చేస్తున్న అదనపు ఫీజులను అరకట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తుంది. ఈ మేరకు డివైఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోటా రమేష్‌, ఆనగంటి వెంకటేష్‌ లు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళోజి హెల్త్‌ యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలు తమ ఇష్టానుసారం ఫీజులు పెంచి విద్యార్థులపై భారం మోపడం సరింది కాదని అన్నారు. బి కేటగిరిలో సీట్లు పొందిన విద్యార్థులను ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాల యాజమాన్యాలు రకరకాల కారణాల పేరుతో ఫీజులు కట్టాల్సిందేనని ఆజ్ఞల పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం తగదు. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్‌ పొందిన మేనేజ్మెంట్‌ కోట విద్యార్థులను ప్రవేశాల సమయంలోనే 12 లక్షల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని, లేకుంటే చేర్చుకోమని చెప్పడం ద్వారా వందలాదిమంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. జీవో 126, 127 ల ప్రకారం ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన నెల రోజుల తర్వాత బ్యాంకు హామీని సమర్పించవచ్చునని, ఈలోపు విద్యార్థుల ప్రవేశాలను ఆపకూడదని జీవోలో స్పష్టంగా ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులు కళాశాలలు తప్పకుండా అమలు చేయాలని, కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రైవేటు కాలేజీలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా బి కేటగిరి సీట్లు పొందిన విద్యార్థులను ఫీజుల కోసం వేధిస్తున్న ప్రైవేటు మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్‌ఐ డిమాండ్‌ చేస్తుంది.