Nov 09,2023 19:09

అమరావతి: కేంద్ర ప్రభుత్వం వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర పేరుతో ఐఏఎస్‌, ఐపీఎస్‌ లను ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.  ఈ ప్రచారం ద్వారా గిరిజనులను మభ్య పెట్టేందుకు మన్యం పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలను ఎన్నుకొన్నదని, రాబోయే ఎన్నికల్లో ఓట్లు గుంజుకునేందుకే అధికారుల బాధ్యతలను దుర్వినియోగం చేస్తున్నదన్నారు. మోడీ హయాంలో దేశం విలాప భారత్‌ గా మారుతున్నది. కరువు కాటకాలు, ఆత్మహత్యలు, అధిక ధరలు, మహిళలు దళితులు ఆదివాసీలపై అత్యాచారాలు, నిరుద్యోగంతో భరతమాత విలపిస్తున్నదన్నారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ విద్రోహాన్ని, ఆదివాసీలకు చేసిన అన్యాయాన్ని ఎక్కడికక్కడ నిలదీసి ప్రశ్నించాలన్నారు. అధికారులు ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకూడదని కోరారు.