
- మహిళా వైద్యులు, సిబ్బంది, విద్యార్థులకు చీర, చుడీదార్
- వైద్య విద్యార్థులు జీన్స్, టీ షర్ట్ ధరించకూడదు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : బోధనాస్పత్రుల్లో సిబ్బంది వస్త్రధారణతో నియమ, నిబంధనలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా మహిళా వైద్యులు, వైద్య విద్యార్థినులు తప్పనిసరిగా చీర గానీ చుడీదార్ గానీ ధరించాలని, జుట్టు వదులుగా వదిలేయకుండా ముడి వేసుకోవాలని, విధి నిర్వహణలో యాప్రాన్ను ధరించడంతో పాటు మెడలో స్టెతస్కోప్ తప్పనిసరిగా ఉండాలని నిర్దేశించింది. ఇక వైద్యులు, సిబ్బంది రోజులో మూడుసార్లు కచ్చితంగా ముఖ హాజరు నమోదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు సర్క్యులర్లు జారీ చేశారు.
బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బంది ఇకపై తమకు నచ్చిన వస్త్రాలను ధరించి విధులకు హాజరు కాకూడదని బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రితో పాటు మిగిలిన ఆస్పత్రుల సూపరింటెండెంట్లు వైద్యుల డ్రెస్ కోడ్, ముఖ హాజరుకు సంబంధించి నిబంధనలపై సర్క్యులర్ను జారీ చేశారు. వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో తప్పనిసరిగా చక్కని వస్త్రధారణతో ఉండాలని, ప్రధానంగా యాప్రాన్ వేసుకోవడంతో పాటు మెడలో తప్పనిసరిగా స్టెతస్కోప్ ధరించాల్సి ఉంటుంది. వైద్య విద్యార్థులు విధులకు హాజరయ్యే సమయంలో సాధారణ వస్త్రధారణతో పాటు బూట్లు వేసుకోవాలి. జుట్టు, గెడ్డం చక్కగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళా వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థినులు తప్పనిసరిగా చీరలు, చుడీదార్లతో విధులకు హాజరు కావాలి. జట్టును హెయిర్ బాండ్తో ముడి వేసుకోవాలి. జీన్స్, టీ షర్ట్ వేసుకోకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు.
- రోజూ మూడుసార్లు ముఖ హాజరు
వైద్యారోగ్యశాఖలోనూ ముఖ హాజరు విధానాన్ని ఈనెల ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. బోధనాస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా హెల్త్ ఫేషియల్ రికగ్నైషన్ సిస్టమ్ (ముఖ హాజరు)కు సంబంధించి ఎన్రోల్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులు ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తప్పనిసరిగా ముఖ హాజరు వేయాలి. ఉన్నతాధికారులు ఆదేశాలకు అనుగుణంగా ఎన్రోల్ కాని వైద్యులు, వైద్య సిబ్బందిపై డిఎంఇ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తప్పవని సూపరింటెండెంట్లు సర్క్యులర్లు జారీ చేశారు.
- అలసత్వం వద్దు
ఆస్పత్రుల్లో రోగులను చేర్చుకునే విషయంలో అలసత్వాన్ని ప్రదర్శించరాదని తాజా ఆదేశాల్లో స్పష్టం చేశారు. రోగుల సహాయకులు ఉన్నా, లేకపోయినా రోగిని సకాలంలో ఆస్పత్రిలో చేర్చుకోవాలని ఆ ఉత్తర్వుల్లో సూచించారు. ప్రతి విభాగంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలుకు సంబంధించిన కచ్చితమైన పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి వారం యూనిట్ల వారీగా ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన సమీక్షను డిఎంఇ నిర్వహించనున్నారు. తాజా నిబంధనలపై వైద్యులు, సిబ్బంది పెదవి విరుస్తున్నారు. విధి నిర్వహణలో అలసత్వంగా ఉన్న వారిపై చర్యలు తీసుకున్నా పర్వాలేదని, ఏ బట్టలు వేసుకోవాలి, ఎటువంటి బూట్లు వేసుకోవాలి, జడ ఎలా వేసుకోవాలో ఆదేశించడం దారుణమంటున్నారు.