Nov 03,2023 21:05

రూ.80వేల కోట్ల మోసం కేసు
శామ్‌ బాంక్‌మన్‌కు న్యూయార్క్‌ కోర్టు శిక్ష
న్యూయార్క్‌ : క్రిఫ్టో ఎక్సేంజీ ఎఫ్‌టిఎక్స్‌ ఫౌండర్‌, సిఇఒ శామ్‌ బాంక్‌మన్‌ను న్యూయార్క్‌ కోర్టు దోషిగా తేల్చింది. ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. క్రిప్టో కరెన్సీ పరిశ్రమలో శామ్‌ను కింగ్‌గా భావిస్తారు. గురువారం న్యూయార్క్‌ కోర్టు ఇచ్చిన తీర్పుతో 31 ఏళ్ల శామ్‌ బాంక్‌మన్‌ ప్రతిష్ట మొత్తం పోయింది. ఆర్థిక మోసాలకు పాల్పడిన శామ్‌కు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. క్రిప్టో ఎక్సేంజీ ప్రారంభించిన అనాతి కాలంలోనే ఆయన సంపద 26 బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.2 లక్షల కోట్లకు) ఎగిసింది. నిధుల దుర్వినియోగం, కృత్రిమ క్రిప్టో ధరలు, మనీలాండరింగ్‌ తదితర అక్రమాలకు పాల్పడిందనేది ప్రధాన అరోపణ. తమసంస్థ దివాలా తీసినట్లు ఎఫ్‌టిఎక్స్‌ స్వయంగా గతేడాది నవంబర్‌లో ప్రకటించింది. దీనిపై విచారించిన న్యూయార్క్‌ కోర్టు దాదాపు 10 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.80వేల కోట్ల) విలువైన ఆర్థిక నేరానికి పాల్పడినట్లు తేల్చింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మోసాల్లో ఒకటని కోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో బ్యాంక్‌మన్‌తో పాటు మరో ముగ్గురూ తమ తప్పులను కోర్టు ముందు అంగీకరించడంతో వారిని దోషిగా తేల్చింది.