May 13,2023 21:32

యుబిఎస్‌ సిఇఒ సెర్జియో ఎర్మొట్టి
జురిచ్‌ : స్విజ్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ బ్యాంక్‌ దిగ్గజం క్రెడిట్‌ సుస్సెలో ఏడాది క్రితం నుంచే సంక్షోభం మొదలయ్యిందని యుబిఎస్‌ సిఇఒ సెర్జియో ఎర్మొట్టి పేర్కొన్నారు. ఇరు బ్యాంక్‌లను విలీనం చేయడానికి క్రెడిట్‌ సుస్సెపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. సంక్షోభంలోని ఆ బ్యాంక్‌ను నెలన్నర క్రితం యుబిఎస్‌ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఆరేడు ఏళ్లుగా జరిగిన అన్ని పరిణామాలపై 360 డిగ్రీల్లో విచారణ జరుపుతున్నామని స్విస్‌ మీడియాతో ఎర్మొటి అన్నారు. ఇప్పటికీ పరిస్థితులు కఠినంగానే ఉన్నాయన్నారు. గత ఆరు వారాల్లో పరిస్థితిలో వృద్థి లేదన్నారు. అలాగని.. గత ఆరేడేళ్లుగా అభివృద్థి ఏమి లేదన్నారు. సమస్యాత్మక క్రెడిట్‌ సుస్సె బ్యాంక్‌ను యుబిఎస్‌ స్వాధీనం చేసుకుంటుందని.. ఈ క్రమంలో ఆ బ్యాంక్‌ సమస్యలకు గల కారణాలపై పూర్తి సమీక్ష ముఖ్యమన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఒక ఏడాది పడుతుందన్నారు. ఈ నెల ముగింపు నాటికి క్రెడిట్‌ సుస్సె స్వాధీన ప్రక్రియ పూర్తి కానుందన్నారు. అమెరికాలో వరుసగా బ్యాంక్‌లు విఫలం కావడంతో క్రెడిట్‌ సుస్సెలోనూ లోపాలు బయటపడ్డాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఒక్కో బ్యాంక్‌ దివాలా తీస్తోంది. ఇటీవల సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌విబి), ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌, సిల్వర్‌ గేట్‌ బ్యాంక్‌, సిగేచర్‌ బ్యాంక్‌లు దివాళా తీసిన విషయం తెలిసిందే. తాజాగా పసిఫిక్‌ వెస్ట్రన్‌ బ్యాంక్‌ కుదుపు బ్యాంకింగ్‌ పరిశ్రమను ఆందోళనకు గురి చేస్తోంది.