Aug 28,2022 12:17

ప్రజాశక్తి - కర్నూలు క్రైం : రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన చేసేలా చర్యలు చేపట్టాలని, జరిమానాల కంటే అవగాహన కల్పించడం ముఖ్యమని జిల్లా పోలీసు యంత్రాంగం సమిష్టిగా కృషి చేసి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ తెలిపారు. వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై పోలీసులు తీసుకున్న చర్యల వివరాలను ఎస్పీ ఆదివారం విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా వాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్‌ లైసెన్సులు లేని వారిపై 266 కేసులు, హెల్మెట్‌ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన చోదకులపై 984 కేసులు, మైనర్ల పై 5 కేసులు నమోదు చేశామని చెప్పారు. ఒన్‌ వే లో రాంగ్‌ రూట్‌ వెళ్ళిన వారిపై 672 కేసులు, మొబైల్‌ మాట్లాడుతూ వాహనం నడిపిన వారి పై 104 కేసులు, జంపింగ్‌ సిగల్‌ 4 కేసులు నమోదయ్యాయన్నారు. ఏలాంటి రికార్డులు పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వారి పై 332 కేసులు, సీటు బెల్టు ధరించకుండా వెళ్తున్న కార్లు , జీపులు , తదితర వాహన చోదకుల పై 24 కేసులు, అతి వేగంతో వెళ్లి న వాహనాల పై 641 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఓవర్‌ లోడ్‌ తో వెళ్ళిన వాహనాల పై మోటారు వాహనాల చట్టం కింద 55 కేసులు, త్రిబుల్‌ రైడింగ్‌ చేసిన 279 మందిపై కేసులు బుక్‌ చేశామని పేర్కొన్నారు. రాంగ్‌ పార్కింగ్‌ చేసిన ద్విచక్రవాహానాల పై 274 కేసులు, రాంగ్‌ పార్కింగ్‌ చేసిన త్రీ, ఫోర్‌ వీలర్‌ వాహానాల పై 402 కేసులు నమోదు చేశామని చెప్పారు. డ్రంకెన్‌ డ్రైవింగ్‌ పై 6 కేసులు నమోదుకాగా ఈ కేసులలోని వారికి కోర్టు ద్వారా 3 రోజుల నుండి 10 రోజుల పాటు కోర్టు జైలు శిక్షలు విధించిందన్నారు. నంబర్‌ ప్లేట్‌ లేని 75 వాహనాలను సీజ్‌ చేశామన్నారు. మొత్తం 6 లక్షల ఈ చలనాలు పెండింగ్‌ లో ఉన్నాయని ఈ వారంలో 7,932 ఈ చలనాలను (రూ.21 లక్షల 26 వేల 125 రూపాయలను) రికవరీ చేశామన్నారు. జిల్లా మొత్తంలో 34 బ్లాక్‌ స్పాట్స్‌ ను గుర్తించామన్నారు. ఈ వారంలో ఆటో డ్రైవర్లకు, ప్రజలకు రోడ్డు భద్రత పై 5 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు , ''స్టాప్‌ వాష్‌ అండ్‌ గో'' కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగినా , రహదారులపై ఇబ్బందికరంగా వాహనాలు నిలిపినా వెంటనే డయల్‌ 100 కు సమాచారం చేరవేయాలని జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. పోలీసు అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. జిల్లాలో గుర్తించిన బ్లాక్‌ స్పాట్స్‌ , స్పీడ్‌ బ్రేకర్లు సూచించేలా వంద మీటర్ల దూరం నుండే హెచ్చరికల బోర్డులు ఉండాలన్నారు . జాతీయ రహదారులపై స్పీడ్‌ గన్స్‌ తో వేగ నియంత్రణకు కషి చేయాలన్నారు. డ్రంకన్‌ అండ్‌ డ్రైవ్‌ , మైనర్‌ డ్రైవింగ్‌ లపై ప్రధానంగా దష్టి సారించాలన్నారు . వీటితో పాటు హెల్మెట్‌ , సీటు బెల్టు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండేలా ... ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్‌ చేయకుండా , పరిమితికి మించి ప్రయాణీకులు వాహనాల్లో వెళ్ళకుండా పలు జాగ్రత్తలు చేపడితే దాదాపు రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చన్నారు. వాహనదారులు ట్రాఫిక్‌ పోలీసుల నిబంధనలు, సూచనలు పాటిస్తూ, ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా గమ్యాలకు క్షేమంగా చేరాలని, ప్రాణనష్టం జరగకుండా తమ ప్రాణాలను రక్షించుకోవాలని ఈ సంధర్బంగా జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

trafic