న్యూఢిల్లీ : ప్రపంచ మార్కెట్లో భారత సరుకులకు డిమాండ్ పడిపోతోంది. వరుసగా మూడో మాసంలోనూ ఎగుమతులు తగ్గాయి. ప్రస్తుత ఏడాది ఫిబ్రవరిలో దేశ ఎగుమతులు 8.8శాతం పతనమై 33.88 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే మాసంలో 37.15 బిలియన్ల ఎగుమతులు జరిగాయి. గడిచిన నెలలో దిగుమతులు 8.21 శాతం తగ్గి 51.31 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. దీంతో దేశ వాణిజ్య లోటు 17.43 బిలియన్ డాలర్లకు ఎగిసింది. 2022 జనవరిలో వాణిజ్య లోటు 17.42 బిలియన్ డాలర్లుగా, ఫిబ్రవరిలో 17.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి కాలంలో భారత సరుకు ఎగుమతులు 7.5 శాతం పెరిగి 405.94 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులు ఏకంగా 18.82 శాతం ఎగిసి 653.47 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రపంచ దేశాల ఉత్పత్తులతో పోటీ పడలేకపోవడం, గ్లోబల్ డిమాండ్లోనూ స్తబ్దత నేపథ్యంలో భారత ఎగుమతులు తగ్గిపోతున్నాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు దిగుమతులు పెరగడంతో భారత వాణిజ్య లోటు ప్రమాదకరంగా మారుతోంది.










