Mar 23,2023 21:21
  • 52 శాతం మంది అసహనం
  • మొబిలిటీ సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌ : దేశంలోని మెజారిటీ మధ్య తరగతి ప్రజలు అధిక ఇంధన ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణాలలో కార్ల యజమానులు అసహనం ప్రకటించారు. ఇంధన ధరల పెంపుదల తమపై తీవ్ర ప్రభావం చూపిందని దాదాపు 52 శాతం మంది ప్రజలు ఎంజి మోటార్స్‌ సర్వేలో పేర్కొన్నారు. ఈ సంస్థ కోసం నీల్సన్‌ సంస్థ అర్బన్‌ మొబిలిటీ హ్యాపినెస్‌ సర్వేను నిర్వహించింది. దేశంలోని అహ్మాదాబాద్‌, బెంగళూరు, పూణె, ముంబయి, ఢిల్లీ ఎన్‌సిఆర్‌, చెన్నరు, హైదరాబాద్‌, కోల్‌కత్తా తదితర ఎనిమిది నగరాల ప్రజలను భాగస్వామ్యం చేసింది. ఈ నగరాలలో ఎక్కువ భాగం వారి రోజువారీ ప్రయాణ సమయంలో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను గుర్తించింది. అర్బన్‌ మొబిలిటీ హ్యాపినెస్‌ సర్వేకు స్పందించిన వారిలో 18 నుంచి 37 ఏళ్ల వయస్సు ఉన్న పురుషులు, స్త్రీలు ఉండగా, వారి ఇంట్లో కనీసం ఒక కారు ఉంది.
రిపోర్ట్‌ వివరాలు.. సర్వేలో పాల్గొన వారిలో దాదాపు 50 శాతం మంది ప్రతి నెలా ఇంధనం కోసం నెలకు రూ.6,000 కన్నా ఎక్కువ ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇంధన ధరల పెరుగుదలతో 56 శాతం మంది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందని హైదరాబాద్‌ వాసులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సమీక్షకు స్పందించిన వారిలో 62శాతం మంది ట్రాపిక్‌ రద్దీతో ప్రయాణ సమయం పెరిగిందని అభిప్రాయపడ్డారు. పలు నగరాల్లో సర్వేకు స్పందించిన వారిలో 74 శాతం మంది తగినంత పార్కింగ్‌ మౌలిక సదుపాయాలను సాధారణ సమస్యగా ఉందన్నారు. దాదాపు 64 శాతం మంది వ్యక్తులు పార్కింగ్‌ అందుబాటులో లేకపోవడం వల్ల తమ కార్లను ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నామని లేదా పార్కింగ్‌ లభ్యతకు అనుగుణంగా తమ ప్లాన్‌లను సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇప్పటికీ పెట్రోల్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. ''అర్బన్‌ మొబిలిటీ హ్యాపీనెస్‌ సర్వే ఫలితాలు భారతీయ వినియోగదారుల డ్రైవింగ్‌ ప్రవర్తన, మొబిలిటీ సొల్యూషన్‌ల కోసం వారి ప్రాధాన్యతలపై మాకు విలువైన సమాచారం లభించింది. కార్ల యజమానులు తమ వాహనాల పనితీరు, ఫీచర్లతో పాటు సౌలభ్యం, భద్రత, మొత్తం డ్రైవింగ్‌ అనుభవానికి కూడా ప్రాధాన్యత ఇస్తారని సర్వే స్పష్టంగా తేటతెల్లం చేసింది. అత్యాధునిక మొబిలిటీ సొల్యూషన్‌లను అందించేందుకు మా బ్రాండ్‌ మా వినియోగదారుల అభివృద్థి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండవలసిన ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకున్నాము'' అని ఎంజి మోటార్‌ ఇండియా చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ గౌరవ్‌ గుప్తా పేర్కొన్నారు.