Jul 12,2023 15:30

ఢిల్లీ: దేశవ్యాప్తంగా టమాట ధరలు రికార్డు స్థాయిలో మండిపోతున్నాయి. పలు చోట్ల కిలో టమాట రూ.200లు పలుకుతోంది. దీంతో వీటి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలకు ఉపక్రమించింది. ప్రధాన వినియోగ కేంద్రాల్లో పంపిణీ చేసేందుకు గాను ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వీటిని సేకరించాలని కేంద్ర సహకార సహకార సంస్థలైన నేషనల్‌ అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ , నేషనల్‌ కోఆపరేటివ్‌ కన్జుమర్స్‌ ఫెడరేషన్‌లను ఆదేశించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లోని ప్రజలకు జులై 14నుంచి రాయితీ ధరకు టమాటాలను పంపిణీ చేస్తామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది.'గుజరాత్‌, మధ్యప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాలకు ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి టమాటాలు సరఫరా అవుతున్నాయి. ఏపీలోని మదనపల్లె నుంచి సరైన పరిమాణంలోనే వస్తున్నాయి.ఢిల్లీకి హిమాచల్‌తోపాటు కర్ణాటక నుంచి అధికంగా వస్తాయి. మహారాష్ట్రలోని, నారాయణ్‌గావ్‌, ఔరంగాబాద్‌తోపాటు మధ్యప్రదేశ్‌ నుంచి త్వరలోనే అదనపు పంట రానుంది. దీంతో త్వరలోనే టమాట ధరలు దిగివచ్చే అవకాశం ఉంది' అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ అంచనా వేసింది.