Oct 02,2023 15:56

ప్రజాశక్తి-విశాఖపట్నం: సీనియర్‌ క్రికెట్‌ కోచ్‌ రహమతుల్లా బేగ్‌ మృతి పట్ల ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పి.శరత్‌ చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్‌.ఆర్‌. గోపినాథ్‌ రెడ్డితో పాటు అపెక్స్‌ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. బేగ్‌ కుటుంబ సభ్యులకు వీరు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రహమతుల్లా బేగ్‌ మృతి క్రికెట్‌ లోకానికి తీరని లోటని అన్నారు. క్రికెట్‌కు ఆయన చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుంటాయని తెలిపారు. కోచ్‌గా ఆరు దశాబ్దాల పాటు సేవలు అందించిన ఆయన నేటి తరానికి స్ఫూర్తి అని.. కపిల్‌ దేవ్‌, రవిశాస్త్రి, అజారుద్దీన్‌, శివరామ కష్ణన్‌, భరత్‌ అరుణ్‌, సంజయ్ మంజ్రేకర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, వి.వి.ఎస్‌. లక్ష్మణ్‌, ఎం.ఎస్‌.కె ప్రసాద్‌లతో పాటు ఎంతో మంది అంతర్జాతీయ క్రికెటర్లకు ఆయన శిక్షణ ఇచ్చారని వారు గుర్తు చేశారు. తన కెరీర్లో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్తో పాటు ఎస్‌ఏఐ, శాప్‌, బీసీసీఐ, హెచ్‌.సీ.ఏలకు ఎన్నో సేవలు అందించారని పేర్కొన్నారు.