
చిట్యాలలో చిట్టి ఏడో తరగతి చదువుతోంది .ఊరి దగ్గరలోనే చిట్టడవి ఉంది. ఆ అడవిలో నుంచి ఓ చిలకమ్మ రోజూ చిట్టి ఇంటికి వచ్చేది. చిట్టి పెట్టే పళ్ళు తిని, కాసేపు కబుర్లు చెబుతుండేది. బడి నుంచి వచ్చిన చిట్టి ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువుకునేది. ఎప్పటి హోంవర్క్ అప్పుడే చక్కగా పూర్తి చేసుకునేది.
ఒక రోజు చిట్యాలలోని జనాలు చిట్టడవిని నరక సాగారు. ఓ రోజు చిలకమ్మ చిట్టిని 'మీ ఊరి వాళ్ళు అడవిని నరికేస్తున్నారు ఎందుకు!?'' అని అడిగింది.
'ఆ .పోడు భూమి సాగు చేస్తారట' అంది చిట్టి.
'అడవులు నరికితే ఏమవుతుందో నీకు తెలియదా?' అడిగింది చిలుక .
'ఎందుకు తెలియదు వర్షాలు పడవు. నేల కోతపడుతుంది ...' అంటూ చెప్పసాగింది చిట్టి.
'మరి మనం అడవులను నరకడం ఆపుదామా' అంది చిలకమ్మ.
'ఎలా?' అని చిట్టి ప్రశ్నార్థకంగా మొహం పెట్టింది.
చిట్టి చెవిలో చిలకమ్మ చిన్నగా ఏదో చెప్పింది. భలే భలే అంటూ భుజాలు ఎగరేసింది చిట్టి. ఆరోజు సాయంత్రం గ్రామ సభకు వాళ్ళ నాన్నతో వెళ్ళింది చిట్టి. పెద్దలేదో మాట్లాడుకుంటుంటే మధ్యలోకి వెళ్లి నిల్చుంది.
'పెద్దలందరికీ నమస్కారం!' అంది వినయంగా. ఇంతలో చిలుకమ్మ వచ్చి, చిట్టి భుజం మీద వాలింది. చిట్టికి ధైర్యం వచ్చింది.
'పెద్దలారా! మన అడవులను మనం నరక్కోవడం మన వేళ్ళతో మన కళ్ళను పొడుచుకోవడం లాంటిదే. వ్యవసాయం కోసమని పెద్ద పెద్ద చెట్లను నరకడం మంచిది కాదు. వర్షాలు పడవు. అడవి జంతువులు ఊరిలోకి వస్తాయి. ఎన్నో ఔషధాలు ఇచ్చే చెట్లను కోల్పోతాం' అని వివరించింది చిట్టి. పెద్దలందరూ ఆ మాటల్లోని సత్యాన్ని గ్రహించారు. గట్టిగా చప్పట్లు కొట్టారు. చెట్లను నరకడం ఆపాలని నిర్ణయించుకున్నారు.
- అమ్మిన వెంకట అమ్మిరాజు
94407 08656