స్వాతంత్య్రోద్యమంలో పెద్దలే కాదు, బాలలు కూడా తమ వంతు పాత్ర నిర్వహించారు. దీనిపై చరిత్రలో పెద్దగా వివరాలు నమోదు చేయబడలేదు. కేరళ బాలల సంఘం ఈ విషయంలో ప్రశంసనీయ మైన కృషి చేసింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా 'ఇండియన్ చిల్డ్రన్ హిస్టరీ'లోని కొన్ని ముఖ్య ఘట్టాల గురించి నేటి బాలలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం గ్రామా ల్లోంచి పుట్టింది. బాలల భాగస్వామ్యం పెరిగింది. దీంతో బాలల కోసం విడిగా సంఘాలు ఏర్పాటు చేసేందుకు కష్ణ పిళ్ళై వంటివారు ఎంతో కృషి చేశారు.
1928లో నెహ్రూ పాల్గొన్న ఓ సదస్సులో విద్యార్థులు గణనీయ సంఖ్యలో పాల్గొన్నారు. 1936లో కాసరగడ్లో జాతీయ జెండాలతో పిల్లలు ఉద్యమంలో పాల్గొన్నారని బాలల సేవా సమితి బాధ్యతలు నిర్వర్తించిన సి.కృష్ణన్ నాయర్ పేర్కొన్నారు.
మఠ మంగళం, కళ్యాసేరి కేసుల్లో రైతులకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాలని బ్రిటిష్ అధికారులు ఎంత ఒత్తిడి చేసినా వారు అదర కుండా బెదరకుండా దృఢంగా నిలిచారు. శిక్షలను ఆహ్వానించారు. వీరంతా పద్నాలుగు సంవత్సరాల లోపువారే! 1938 నాటికి వచ్కేసిరికి కేరళలోని ఒక్క చిరకల్ తాలూకాలోనే 70 బాలల సంఘాల దాకా ఏర్పడ్డాయి. కయ్యూరు పోరాటంలో పాల్గొన్నందుకు ఉరి తీయబడ్డ చిరుకందన్ మొదట్లో బాలభారతం సంఘ సభ్యుడే. కన్నూరు జిల్లాలోని ప్రస్తుత కళ్యాస్సేరిలో 1938 డిసెంబర్ 28న జాతీయ బాలల సంఘం ఏర్పడింది. 1938 అక్టోబర్లో 400 మంది బాలలతో జాతీయ సమ్మేళనం జరిగింది. 'నేషనల్ చిల్డ్రన్స్ అసోసియేషన్' పేరుతో నారాయణన్ నంబియార్ నాయకత్వం వహించారు. కృష్ణ పిళ్లై, ఏకే గోపాలన్, ఇఎంఎస్ వంటి నాయకులు జాతీయ బాలల సంఘాల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
కేరళలోనే కాదు దేశమంతా స్వాతంత్రోద్యమంలో బాలలు తమ వంతు పాత్ర పోషించారు. అయితే, చరిత్రలో ఇవి సరిగా నమోదుకాలేదు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం బాల్యం నుంచే రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు.
ఇందిర వానర సైన్యం : స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ వారు నాయకులను ఎవరిని ఏ క్షణాన అరెస్టు చేస్తారో తెలిసేది కాదు. కాంగ్రెస్ కార్యకర్తలకు అటువంటి వార్తలు చేరవేసేందుకు ఇందిరా గాంధీ తన స్నేహితులతో కలసి 'వానర సేన'ను ఏర్పాటు చేసింది. వారు వార్తలను చేరవేయడం, జెండాల ను తయారుచేయడం, పోలీసు చర్యలపై గూఢచర్యం చేయడం వంటి పనులను చేసేవారు. 'మనం పిల్లలమైనా స్వాతంత్య్రం కోసం మనవంతు కృషి చెయ్యాలి' అని సహచర పిల్లలకు ఇందిర చెప్తూ ఉండేది. గాంధీజీ నిరాహార దీక్షలో ఉన్నప్పుడు ఆయన పక్కనే పిల్లలు కూర్చుని తమ సంఘీభావం తెలిపేవారు.
కోజికోడ్లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మహిళలను జైలులో పెడితే, పిల్లలు స్కూలు నుంచి జైలుకి యాత్రగా వెళ్లి, అక్కడ సత్యాగ్రహం చేశారు. 'మా తల్లులను విడిచి పెట్టే వరకు వెళ్ళం' అంటూ అక్కడే బైఠాయించారు. దీనికి 9వ తరగతి చదువుతున్న జయలక్ష్మి నాయకత్వం వహించింది. పద్నాలుగేళ్ల వయసులోనే చంద్రశేఖర్ ఆజాద్ (1906 -1931) వారణాసిలో సహకార ఉద్యమంలో పాల్గొన్నాడు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు అరెస్టు చేశారు.
ఉద్ధమ్ సింగ్ తన పేరును చిన్నప్పుడే రామ్ మహ్మద్సింగ్ ఆజాద్ అని మార్చుకున్నాడు. హిందూ, మహమ్మదీయ, సిక్కు మతాలకు ఏకత్వాన్ని ఆపాదిస్తూ, తన పేరును అలా మార్చుకున్నాడు. ఆయన త్యాగానికీ, దేశభక్తికీ మెచ్చుకొని ఇతడిని షహీద్-ఎ-అజం (వీరుల్లో అగ్రుడు)గా వ్యవహరిస్తారు.
ఏప్రిల్ 13, 1919న జలియన్వాలాబాగ్ దురంతంలో ఉద్దమ్ సింగ్ గాయపడినప్పుడు అతడి వయసు 14 సంవత్సరాలు. స్వేచ్ఛ కోరినందుకు వందలాది మంది దేశ ప్రజలను నిర్దాక్షిణ్యంగా తగలబెట్టిన బ్రిటిష్ అధికారి డయ్యర్ని వదలనని ఉద్దం సింగ్ ప్రతిజ్ఞ చేశాడు. బ్రిటిష్ ప్రభుత్వం వారిని ఆనాడే భారతదేశపు మొదటి మార్కి ్సస్టులుగా పేర్కొంది. 1940 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ ఊచకోతకు ప్రతీకారంగా ఉద్దం సింగ్ లండన్ కాక్స్టన్ హాల్లో డయ్యర్ని కాల్చి చంపి, పోలీసులకు లొంగిపోయాడు. లాలా లజపతిరారును కాల్చి చంపిన బ్రిటిష్వారిపై భగత్సింగ్ సింహంలా గర్జించాడు. ఆనాటి బ్రిటిష్ భారత పార్లమెంటులో బాంబులు విసిరిన కేసులో ఉరితీశారు (మార్చి 23, 1931), అప్పటికి ఆయన 24 సంవత్సరాలు.
భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఉరికి ప్రతీకారంగా మెజిస్ట్రేట్ని తుపాకీతో కాల్చి చంపిన శాంతిగోష్, సునీతా చౌదరి కూడా బాలల ఉద్యమం నుంచి వచ్చినవారే. వీరికి తొలుత మరణశిక్ష విధించిన మేజిస్ట్రేట్, బాలికల వయసును పరిగణనలోకి తీసుకుని ఉరి శిక్షను జీవిత ఖైదుగా మార్చారు.
ఝాన్సీ లక్ష్మీబాయి పద్నాల్గవ యేటనే ఝాన్సీ కత్తి పట్టి కదన రంగంలోకి దూకారు. భారతదేశపు 'జోన్ ఆఫ్ ఆర్క్'గా ఆమె చరిత్రకెక్కారు. 29 ఏళ్లకే రణ క్షేత్రంలో వీరమరణం పొందారు.. 1857 మొదటి స్వాతంత్య్ర సమరంలో ఝాన్సీ పట్టణం విప్లవకారుల నిలయంగా ఉండేది.
దేశంలో ఏ ఉద్యమం జరిగినా ఆ ఉద్యమాల్లో విద్యార్థులు, బాలలు తమ వంతు పాత్ర పోషించడం జరుగుతోంది. విశాఖ ఉక్కు సాధనలోనూ విద్యార్థులు కీలకపాత్ర పోషించారు.
సరళీకరణ ప్రపంచీకరణ విధానాల ప్రభావం వల్ల విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు వల్ల విద్యార్థి ఉద్యమాల రూపంలో మార్పు వచ్చింది. కేంద్రంలో నల్లచట్టాలను తీసుకొచ్చిన నరేంద్రమోడీ ప్రభుత్వ మెడలు వంచిన రైతు ఉద్యమంలో విద్యార్థులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నారు.
కుల, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ఆరెస్సెస్, బిజెపి ముందుకు తెస్తున్న మనువాదం దేశాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తుంది. ఈ మనువాదులను మట్టి కరిపించి, బాలల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. ఇందుకు బాలల సంఘాలను, వేదికలను విస్తృతంగా ఏర్పాటు చేయాలి.

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి పిన్నవయసులోనే అమరురైన విప్లవ వీరుల్లో ఖుదీరాం బోస్ ఒకరు. బోస్ బెంగాల్ ప్రెసిడెన్సీలోని మిడ్నపూర్ జిల్లా మొహబనిలో త్రైలోకి నాథ్ బోస్, లక్ష్మి ప్రియ దంపతులకు 1889 డిసెంబరు3న జన్మించిన ఖుదీరాం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ముజఫర్పూర్ కుట్ర కేసులో ప్రఫుల్లా చకితో బాటు ఆయనను 1908 ఆగస్టు 11న బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీయించింది. బ్రిటిష్ జడ్జి డగ్లస్ కింగ్ఫోర్డ్పై బాంబులు విసిరి హత్యాయత్నానికి పాల్పడ్డారన్న అభియోగంపై వీరిని ఉరి తీశారు. అతి పిన్న వయసులో ఉరి కంబమెక్కిన బాల స్వాతంత్య్ర సమర యోధుల్లో ఖుదీరాం బోస్ రెండవ వాడు.
ఖుదీరాం బోస్

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేసి పన్నెండేళ్ల వయసులోనే అసువులు బాసిన బాల యోధుడు బాజీ రావత్. పడవ నడిపే ఈ కుర్రాడు బ్రిటిష్ పోలీసులను బ్రాహ్మణి నదిని దాటించేందుకు తిరస్కరించడంతో 1938 అక్టోబరు11వ తేదీ రాత్రి అతడిని కాల్చి చంపారు. బాపీ వారవత్ ఒడిశాలోని దెంకానల్ జిల్లా నీలకంఠాపూర్లో 1926 అక్టోబరులో జన్మించారు.
బాజీ రావత్

భారత స్వాతంత్య్రోద్యమంలో 27 ఏళ్ల వయసులోనే నేలకొరిగిన వీరుడు కుమరన్. మద్రాసు ప్రెసిడెన్సీలోని చెనిమలై (ప్రస్తుతం ఈరోడ్)లో 1904 అక్టోబరు4న జన్మించారు. దేశ బంధు యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిని దేశం నుంచి పారద్రోలేందుకు ఉద్యమించాడు. 1932 జనవరి 11న నిరసన ప్రదర్శనలో పాల్గొన్న కుమరన్పై తిరుప్పూర్ లోని నొవియాల్ నది ఒడ్డున బ్రిటిష్ పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి కన్నుమూశాడు.
కోడికాత కుమరన్










