
ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్యజిల్లా) : క్షేత్ర స్థాయిలో ఆశాల సేవలు కీలకమని అన్నమయ్య జిల్లా డిపిఎమ్ఓ డాక్టర్ లోకవర్ధన్ తెలిపారు. ఆశ దినోత్సవంలో భాగంగా మంగళవారం కెవి పల్లి మండలం, గ్యారంపల్లి పి.హెచ్.సిలో డాక్టర్ లోకవర్ధన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలలో చేసిన పనిని అంచనా వేసుకుని, రాబోయే నెలలో ఏ కార్యక్రమంలో విధులు నిర్వహించి లక్ష్యం సాధించాలి అనే దానిపై సమీక్షించుకోవాలన్నారు. ఈనెల 11 నుండి 16వ తేదీ వరకు మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమంలో లబ్ధిదారులను గుర్తించిన వారికి టీకాలు వేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి పి.హెచ్.సిలో కాన్పులు జరిగేలా ఆశ కార్యకర్తలు వారి పరిదిలోని గర్భవతులను ప్రోత్సాహించి కాన్పులు జరిగేలా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ, పిహెచ్ఎన్ రెడ్డెమ్మ, పర్యవేక్షకులు శ్యామల, ఎమ్.ఎల్.హెచ్.పిలు, ఏఎన్ఎమ్ లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.