Nov 04,2023 16:25

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దర్శించుకున్నారు. వెంకన్న సన్నిధిలో నామినేషన్‌ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో సీఎం కేసీఆర్‌ నామినేషన్‌ పత్రాలపై సంతకం చేశారు. కేసీఆర్‌ ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన ప్రతిసారీ ఈ ఆలయంలో పూజలు చేసేందుకు వస్తుంటారు. ఈ నెల 9న గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు. అదే రోజు బీఆర్‌ఎస్‌ ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం సీఎం కేసీఆర్‌కు, పార్టీకి సెంటిమెంట్‌గా మారింది. ఏ ఎన్నికలు వచ్చినా సీఎం కేసీఆర్‌ ఇక్కడ పూజలు చేసిన తర్వాతే నామినేషన్‌ వేస్తారు. ఎన్నికల వేళ సీఎం కేసీఆర్‌, హరీశ్‌ రావు తదితర పార్టీల నేతలు వెంకన్నను దర్శించుకుని స్వ మివారి సన్నిధిలో నామినేషన్‌ పత్రాలు వేసి పూజలు చేస్తారు. కోనాయిపల్లి వెంకన్నకు సీఎం కేసీఆర్‌ పూజలు చేసిన ప్రతిసారీ కేసీఆర్‌ విజయం సాధించారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినందున 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018 ఎన్నికల సందర్భంగా ఈ ఆలయంలో పూజలు చేసి నామినేషన్లు వేశారు. అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించాడు. 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన కేసీఆర్‌ ఆ తర్వాత ఈ ఆలయంలో పూజలు చేసి టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రకటించడం మరో విశేషం.