Mar 03,2023 21:01

సెన్సెక్స్‌ 900 పాయింట్ల ర్యాలీ
దుమ్మురేపిన పిఎస్‌బి షేర్లు

ముంబయి : గత కొన్ని సెషన్లలో ఒత్తిడిని ఎదుర్కొన్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారాంతం రోజున ఒక్క సారిగా రివ్వున ఎగిశాయి. కొనుగోళ్ల మద్దతుతో శుక్రవారం సెషన్‌లో భారీ లాభాలను సాధించాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, అదాని స్టాక్స్‌ మద్దతుతో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 900 పాయింట్లు రాణించి 59,809కి చేరింది. ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 272 పాయింట్లు పెరిగి 17,594 వద్ద ముగిసింది. అదాని ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ 17 శాతం పెరిగి రూ.1,879కి చేరింది. అదాని ఇతర స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సూచీలకు డిమాండ్‌ పెరిగింది. నిఫ్టీలో పిఎస్‌యు బ్యాంక్‌ ఇండెక్స్‌ 5.4 శాతం పెరిగింది. యూకో బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ స్టాక్స్‌ ఏకంగా 8 శాతం చొప్పున లాభపడ్డాయి. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌ షేర్లు 6 శాతం పైగా పెరిగాయి. ఎస్‌బిఐ, కెనరా బ్యాంక్‌లు 5 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. లోహ సూచీ 3.5 శాతం, ఎఫ్‌ఎంసిజి, రియాల్టీ సూచీలు ఒక్క శాతం చొప్పున పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు దేశీయ స్టాక్స్‌కు మద్దతుగా నిలిచాయి. ఫిబ్రవరిలో సేవల రంగం కార్యకలాపాలు 12 ఏళ్ల గరిష్ఠానికి చేరాయనే రిపోర్టులు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచాయి.