Jul 05,2023 20:30
  • డాలర్‌పై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి
  • మెర్కూసర్‌ శిఖరాగ్ర సదస్సులో బలీవియా అధ్యక్షుడు అర్సె పిలుపు

ప్యూర్టో ఇగువాజు (అర్జెంటీనా): అమెరికా ఫైనాన్షియల్‌ వ్యవస్థ విధించే ఆంక్షలను తిరస్కరించాలని, డాలర్‌పై ఆధారపడాన్ని తగ్గించుకోవాలని సదరన్‌ కామన్‌ మార్కెట్‌ (మెర్కూసర్‌)ను బలీవియా అధ్యక్షుడు లూయిస్‌ ఆల్బర్టో అర్సే కెటాకొరా కోరారు. లాటిన్‌ అమెరికా విదేశీ వాణిజ్యంలో డాలర్‌కు బదులు స్థానిక కరెన్సీని ఎక్కువగా వాడాలని పిలుపునిచ్చారు. పెట్టుబడిదారీ విధానం వ్యవస్థాగత సంక్షోభంలో పడిందని, ఈ పరిస్థితుల్లో మనం ప్రత్యామ్నాయ మెకానిజాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరమెంతైనా ఉందని అన్నారు.. మంగళవారం నాడిక్కడ జరిగిన మెర్కూసర్‌ అండ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్స్‌ 62వ శిఖరాగ్ర సదస్సులో అర్సె కెటాకొరా మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో డాలర్‌కు ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని అన్నారు. అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషిస్తున్న చైనా వంటి దేశాలతో వ్యూహాత్మక మైత్రిని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. నూతన ప్రపంచ వ్యవస్థ ను నిర్మించేందుకు యురేసియన్‌, ఆసియన్‌, బ్రిక్స్‌ కూటమి వంటి సంస్థల ద్వారా జరుగుతున్న కృషికి మన వంతు తోడ్పాటునందించాలని ఆయన మెర్కూసర్‌ను కోరారు.