
ప్రజాశక్తి-చీరాల (బాపట్ల) : ఎద్దుల బండిని బైక్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన కారంచేడు చీరాల రోడ్డులో సోమవారం వేకువజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ... చీరాల పట్టణం ఉడ్నగర్ కు చెందిన తేళ్ళ రాజేష్ (40) చీరాలలోని ఓ బ్లడ్ బ్యాంకులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈరోజు వేకువజామున బైక్ పై ప్రయాణిస్తూ కారంచేడు రోడ్డులో ఎద్దుల బండిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.