Aug 02,2023 09:37

పాట్నా: దేశంలో జనాభా లెక్కల్లో కులాల వారీగా కుల గణన చేపట్టాలని దేశ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో కులగణననుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా బీహార్‌లో ఈ ఏడాది జనవరిలో కుల గణన ప్రారంభమైంది. రెండో విడత సందర్భంగా కొందరు కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో మంగళవారం పాట్నా హైకోర్టు తీర్పు కీలకంగా మారింది. నితీశ్‌ సర్కార్‌కు పాట్నా హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కులగణనకు మార్గం సుగమం అయింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన కులగణన సర్వేను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. బీహార్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను పట్నా హైకోర్టు మంగళవారం కొట్టేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను తిరిగి ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది జనవరిలో బిహార్‌ ప్రభుత్వం కులగణనను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మొదటి దశ సర్వే జనవరి 7-21 తేదీల మధ్య ముగిసింది. రెండో సర్వే ఏప్రిల్‌ 15న మొదలై మే15తో ముగియాల్సి ఉండగా.. మే 4న పాట్నా హైకోర్టు సర్వేపై స్టే విధించింది. మంగళవారం కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె. వినోద్‌ చంద్రన్‌ నేతత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి వాటిని కొట్టేసింది. అయితే, పాట్నా హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని పిటిషనర్ల తరపు న్యాయవాది దిను కుమార్‌ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ కులాల వారి అభ్యున్నతికి పాటుపడేందుకు వీలుగా వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల గురించి సమాచారం తెలుసుకునేందుకు బిహార్‌లో కులగణన చేపట్టనున్నట్లు గతేడాది సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రకటించారు. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో రెండు దశల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని అప్పట్లో ప్రకటించారు.