Mar 11,2023 08:10
  •  తీవ్ర సంక్షోభంలో ఎస్‌విబి
  •  నిధుల కటకట
  •  పెరిగిన నష్టాలు
  •  కంపెనీ షేర్‌ 60% పతనం
  •  ఒక్క పూటలో రూ.6.5 లక్షల కోట్లు ఆవిరి

వాషింగ్టన్‌: అమెరికాలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. అతిపెద్ద అమెరికా వాణిజ్య బ్యాంక్‌ల్లో ఒక్కటైన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌విబి) తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. 2008 నాటి లెమన్‌ బ్రదర్స్‌ సంక్షోభాన్ని మర్చిపోకముందే ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళన గురి చేస్తోంది. ఎస్‌విబి ఫైనాన్షియల్‌ గ్రూప్‌ నిధుల సమీకరణ పడిపోవడం, సెక్యూరిటీస్‌ పోర్టుపోలియోలో నష్టాలు పెరగడంతో ఆ బ్యాంక్‌ బాండ్లు, షేర్లు భారీ పతనాన్ని (క్రాష్‌) చవి చూశాయి. శాంటా క్లారాలో ప్రధాన కార్యాలయం కలిగి పని చేస్తున్న ఈ బ్యాంక్‌ డిపాజిట్లు, రుణాలు ఇవ్వడం, ట్రెజరీ నిర్వహణ, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, విదేశీ మారక వాణిజ్యం, అనేక ఇతర విత్త సేవలను నిర్వహిస్తుంది. ఇది అంతర్జాతీయ బ్యాంకింగ్‌ను కూడా అందిస్తూ అమెరికాలో ప్రధాన బ్యాంక్‌గా పరిగణించబడుతోంది. ఫోర్చూన్‌.కమ్‌ రిపోర్ట్‌ ప్రకారం.. యుఎస్‌లోని 50 శాతం వెంచర్‌ బ్యాక్డ్‌ (టెక్‌, స్టార్టప్‌) కంపెనీలకు సేవలందిస్తుంది. దేశంలోని సంపన్నులందరూ ఈ బ్యాంక్‌ సేవలను పొందుతున్నారు.

  • ఏమి జరిగింది..!

సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఎస్‌విబి గ్రూపు 21 బిలియన్ల సెక్యూరిటీలను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు 2.25 బిలియన్‌ డాలర్ల విలువ చేసే షేర్లను అమ్మకానికి పెట్టింది. నిధుల సమీకరణ కోసం వాటాలను విక్రయానికి పెట్టగా విఫలమైందని రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుత వారం ప్రారంభంలోనే ఈ సంక్షోభం బయటికి వచ్చినట్లు రిపోర్టులు వస్తున్నాయి. అమెరికా ట్రెజరీ పోర్టుపోలియోలను నష్టాలకు విక్రయించిందని సమాచారం. బ్యాంక్‌ వద్ద డిపాజిట్లు కరిగిపోవడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. మరోవైపు ఇచ్చిన రుణాలపై వచ్చే నికర వడ్డీ ఆదాయంలో కూడా క్షీణతను చవి చూసింది. వీటికి తోడు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వరుసగా వడ్డీ రేట్లను పెంచుతోంది. దీంతో తనఖా సెక్యూరిటీలపై అధికంగా వడ్డీ చెల్లించాల్సి రావడం మరింత ఒత్తిడిని పెంచింది.

  • యూరప్‌ బ్యాంక్‌లపై ప్రభావం

అనిశ్చితి పరిణామాలతో గురువారం సెషన్‌లో ఎస్‌విబి షేర్‌ విలువ 60 శాతం పతనమయ్యింది. దీంతో ఒక్క పూటలోనే దాదాపు 80 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.6.5 లక్షల కోట్లు) మార్కెట్‌ విలువ కోల్పోయింది. ఆ బ్యాంక్‌ షేర్లు మాత్రమే కాకుండా బాండ్ల విలువ కూడా భారీ పతనాన్ని చవి చూసింది. ఆ బ్యాంక్‌ 35 ఏళ్ల ట్రేడింగ్‌లో అతిచెత్త సెషన్‌గా నమోదయ్యింది. ఇది యూరప్‌లోని బ్యాంకింగ్‌ స్టాక్స్‌ను గత తొమ్మిది మాసాల్లో ఎప్పుడూ లేని విధంగా పడేసింది. వరుసగా రెండో రోజూ అమెరికాన్‌ బ్యాంక్‌ల సూచీలు పతనాన్ని చవి చూశాయి. భారత్‌లోని దిగ్గజ బ్యాంక్‌ షేర్లపైన ఒత్తిడి చోటు చేసుకుంది. ఎస్‌విబి ప్రభావంతో వారాంతం సెషన్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ 2.63 శాతం, హెచ్‌డిఎఫ్‌సి 2.27 శాతం, ఎస్‌బిఐ 2.12 శాతం, ఇండుస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.06 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.89 శాతం చొప్పున పడిపోయాయి. నిఫ్టీలో బ్యాంకింగ్‌ సూచీ 1 శాతం నష్టపోయింది.

  • డబ్బు సురక్షితమేనా..?

ఎస్‌విబి ట్రెజరీ పోర్టుపోలియోలో సగటున 1.79శాతం రాబడిని ఇస్తోంది. ఇది ప్రస్తుత 10-సంవత్సరాల ట్రెజరీ దిగుబడి 3.9 శాతం కంటే చాలా తక్కువగా ఉందని రాయిటర్స్‌ తెలిపింది. దీంతో పెట్టుబడిదారుల డబ్బు సురక్షితంగా ఉందా..? నష్టాలను భర్తీ చేయడానికి నిధుల సేకరణ సరిపోతుందా..? అనే ఆందోళనలను పెంచింది. ఈ పరిణామాలు పీటర్‌ థీల్‌ ఫౌండర్స్‌ ఫండ్‌, కోట్యు మేనేజ్‌మెంట్‌, యూనియన్‌ స్క్వేర్‌ వెంచర్స్‌తో సహా అనేక మంది ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్టులను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. ఆ బ్యాంక్‌ సుస్థుర వ్యాపారంపై అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అనిశ్చిత్తిని ఎదుర్కొంటున్న సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పరపతిని సమీక్షీంచనున్నట్లు గ్లోబల్‌ రేటింగ్‌ ఎజెన్సీ మూడీస్‌ పేర్కొంది.

  • భవిష్యత్తు భయానకమే..!

చాలా మంది నిపుణులు ఈ సంక్షోభాన్ని లెమాన్‌ బ్రదర్స్‌ సంక్షోభం, ఎన్రాన్‌ కార్పొరేషన్‌తో పోల్చుతున్నారు. మరోవైపు అమెరికా మాంద్యం అంచున ఉంది. దీనికి తోడు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్న సమయంలో సంక్షోభం ఏర్పడింది. టెక్‌ కంపెనీలు, స్టార్టప్‌లు తమ డబ్బును బ్యాంకు నుండి బయటకు తీయడాన్ని కొనసాగిస్తే, ఎస్‌విబి గ్రూప్‌ దివాళా తీయడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే మాంద్యం మరింత పెరగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదాన్ని సష్టించగలదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.