Apr 06,2023 21:24

వాషింగ్టన్‌ : బ్యాంకింగ్‌ వ్యవస్థలో మరింత గందరగోళం నెలకొనే అవకాశాలున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అన్నారు. ఇటీవల సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, క్రెడిట్‌ సూస్సె దివాళా నేపథ్యంలో రాజన్‌ తాజాగా హెచ్చరించారు. 2009 నాటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఆయన ముందుగానే అంచనా వేశారు. తాజాగా గ్లాస్గోలో రాజన్‌ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ''నేను మంచే జరగాలని కోరుకుంటున్నాను. కానీ.. కొన్ని అనుకోని సవాళ్లు ఎదురు కావొచ్చు. సులభ నగదు, దీర్ఘకాలం అధిక లభ్యత వల్ల కొన్ని పరిణామాలు కఠినంగా మారొచ్చు. క్రెడిట్‌ సుస్సెలోని సమస్యలు ఆర్థిక వ్యవస్థలో అంతర్లీన సమస్యలను సూచిస్తున్నాయి.'' అని పేర్కొన్నారు. ప్రస్తుతం చికాగో యూనివర్సిటీ బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న రాజన్‌ 2013 నుండి 2016 వరకు ఆర్‌బిఐ గవర్నర్‌గా పని చేశారు.