
- అగ్రస్థానానికి చేరుకోలేకపోతున్న వైనం
- పలు మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో
- తక్కువ సంఖ్యలో అధికారులు
- గత ప్రభుత్వాల నుంచి మోడీ సర్కారు వరకు ఇదే తీరు
- సామాజిక కార్యకర్తల ఆందోళన
న్యూఢిల్లీ : దేశంలోనే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్లో అణగారిన, వెనకబడిన వర్గాల వారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరీక్షలు ఉద్యోగాల్లో ఎస్సి, ఎస్టి, ఒబిసిలు అగ్రస్థానానికి చేరుకోలేకపోతున్నారు. యుపిఎ హయాం నుంచి ప్రస్తుతం బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ సర్కారు వరకు ఇదే తీరు కనిపిస్తున్నది. ఈ పరిస్థితులపై సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సమయంలో రాహుల్ గాంధీ ఒబిసి కోసం ప్రత్యేక కోట అంశాన్ని లేవనెత్తారు. అలాగే ఉన్నతాధికారుల్లో ఒబిసి ఆఫీసర్లు ఎంత మంది ప్రాతినిథ్యం వహిస్తున్నారని ప్రశ్నించారు.
భారత్లో ఈ ఏడాదిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. రాబోయే ఏడాదిలో లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో ఒబిసిలు, ఎస్సిలు, ఎస్టిలు కీలకంగా వ్యవహరించనున్నారు. రాజకీయ పార్టీలు సైతం వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే, ఎన్నికల్లో కీలకంగా ఉన్న ్ల ఒబిసిలు, ఎస్సిలు, ఎస్టిలు బ్యూరోక్రసీలో మాత్రం ఎందుకు వెనకబడిపోతున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వాలు ఉదాసీన వైఖరిని సైతం వారు తప్పుబడుతున్నారు.
భారతదేశంలోని అత్యున్నత బ్యూరోక్రసీలో వైవిధ్యం లేకపోవటం స్పష్టమవుతున్నది. ప్రస్తుతం వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లలో సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద జాయింట్ సెక్రెటరీలు, సెక్రెటరీల పోస్టులను కలిగి ఉన్న మొత్తం 322 మంది అధికారులలో ఎస్సిలు 16, ఎస్టిలు 13, ఒబిసిలు 39 మంది, జనరల్ కేటగిరీకి చెందినవారు 254 మంది ఉన్నారు. గతేడాది మార్చి నాటికి ప్రభుత్వ సమాచారం ప్రకారం.. 91 మంది అదనపు కార్యదర్శుల్లో ఎస్సిలు పది మంది, ఎస్టిలు నలుగురు, ఒబిసిలు 245 మంది ఉన్నారు. ఇక 245 మంది జాయింట్ సెక్రెటరీలలో అధికారుల సంఖ్య ఎస్సిలు, ఎస్టిలు కలిపి 26 మంది కాగా.. ఒబిసిలు 29 మంది ఉన్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వ హయాంలోనూ దేశంలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 2015 నాటి డేటా ప్రకారం 70 మంది కార్యదర్శులలో ఎస్సిలు ముగ్గురు, ఎస్టిలు ముగ్గురు ఉండగా.. ఒబిసిలు అధికారులు ఒక్కరూ లేకపోవటం గమనార్హం. 278 మంది జాయింట్ సెక్రటరీలలో ఎస్సిలు 24 మంది, ఎస్టిలు 10 మంది, ఒబిసిలు 10 మంది అధికారులు మాత్రమే ఉన్నారు.
వివిధ కేటగిరీలకు సివిల్ సర్వీసెస్ పరీక్షకు పదవీకాలం, వయస్సు ప్రమాణాలలో వ్యత్యాసం ఉంటుంది. ఆర్థికంగా వెనుకబడిన విభాగం (ఈడబ్ల్యూఎస్) కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లు. అయితే ఒబిసిలకు ఇది 35 కాగా.. ఎస్సి, ఎస్టిలకుకు ఇది 37 ఏళ్ళుగా ఉన్నది. అయితే, పరోక్షంగా ఇది ఎస్సి, ఎస్టిలు, ఒబిసిల అభ్యర్థులలో చాలా మందికి తక్కువ సర్వీసుకు కారణమవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు.