Aug 24,2023 08:04

జోహన్నస్‌బర్గ్‌: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగింట ఒక వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిక్స్‌ దేశాధినేతలు బుధవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో సమావేశమై విస్తరణ, సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టి సారించారు. అంతర్జాతీయ రంగంలో వర్ధమాన దేశాలు మరింత సందర్భోచితంగా మారుతున్నాయని, కొత్త ప్రపంచ ఆర్థిక, రాజకీయ క్రమాన్ని రూపొందించేందుకు ఈ శిఖరాగ్ర సమావేశం ఎంతగానో దోహదపడుతుందని చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్‌ అన్నారు.
15వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో బుధవారం జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. అభివృద్ధి అనేది కొన్ని దేశాల ప్రత్యేక హక్కు కాదని, అన్ని దేశాలకు విడదీయరాని హక్కు అని అన్నారు. 'బ్రిక్స్‌ దేశాలు అభివృద్ధి, పునరుజ్జీవన మార్గంలో సహచరులుగా ఉండాలి, పారిశ్రామిక- సరఫరా గొలుసులను విచ్ఛిన్నం చేసే చర్యలను వ్యతిరేకించాలి, అలాగే ఆర్థిక బలవంతం చేయాలి. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ, హరిత అభివృద్ధి, సరఫరా గొలుసు వంటి రంగాలలో ఆచరణాత్మక సహకారంపై దృష్టి పెట్టాలి' అని చెప్పారు. అలాగే
బ్రిక్స్‌ సత్వర విస్తరణతో పాటు మరింత న్యాయమైన- సహేతుకమైన ప్రపంచ పాలనను ప్రోత్సహించేందుకు కృ చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.
'ఒకరి స్వంత నియమాలు- నిబంధనలను అంతర్జాతీయ ప్రమాణంగా ప్యాకేజ్‌ చేయడం ఆమోదయోగ్యం కాదు'' అని చెప్పారు. బ్రెజిల్‌ అధ్యక్షులు లూయిజ్‌ ఇనాసియో లులా డా సిల్వా, భారత ప్రధాని నరేంద్ర మోడీ, దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్‌ రమఫోసా కూడా ప్రసంగించారు. రష్యా నుంచి ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ వ్యక్తిగతంగా రష్యాకు ప్రాతినిధ్యం వహించగా, రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌ వర్చువల్‌ విధానంలో ప్రసంగించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేయాల్సిన అవశ్యకతను వివరించారు.
40కి పైగా దేశాలు బ్రిక్స్‌లో చేరేందుకు ఆసక్తిని వ్యక్తం చేయడంతో కొత్త సభ్యులను చేర్చుకునే నిబంధనలను నాయకులు పరిశీలించారు.

బ్రిక్స్‌ విస్తరణకు భారత్‌ పూర్తి మద్దతు: మోడీ

ఏకాభిప్రాయం ఆధారంగా బ్రిక్స్‌ కూటమిని మరింత విస్తరించేందుకు భారత్‌ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. భాగస్వామ్య దేశాల పరస్పర సహకారంతో ముందుకు వెళ్లడాన్ని తాము స్వాగతిస్తామన్నారు. దక్షిణాఫ్రికాలో జరిగిన 15వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన మోడీ ఆఫ్రికన్‌ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వాన్ని తాము ప్రతిపాదిస్తున్నామన్నారు. బ్రిక్స్‌ భాగస్వామ్య పక్షాలు కూడా ఇందుకు మద్దతు పలుకుతాయని ఆశిస్తున్నామని అన్నారు.
భవిష్యత్తుకు బ్రిక్స్‌ సంసిద్ధంగా ఉండాలంటే మనం మన సమాజాలను భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. భారత్‌ అధ్యక్షతన జరుగుతోన్న జీ20 సదస్సులో గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు తమ దేశం అత్యంత ప్రాధాన్యం కల్పిస్తోందని చెప్పిన మోడీ, బ్రిక్స్‌లోనూ అటువంటి ప్రాముఖ్యతను కల్పించడాన్ని స్వాగతించారు. గ్లోబల్‌ సౌత్‌ అభివృద్ధిలో బ్రిక్స్‌కు చెందిన న్యూ డెవెలప్‌మెంట్‌ బ్యాంక్‌ కీలక పాత్ర పోషిస్తోందన్న ఆయన.. గడిచిన రెండు దశాబ్దాలుగా ఈ కూటమి ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగుతోందన్నారు. రైల్వే రీసెర్చ్‌ నెట్‌వర్క్స్‌, ఎంఎస్‌ఎంఈల మధ్య సహకారం, స్టార్టప్‌ రంగాల్లో తీసుకోవాల్సి చర్యలపై భారత్‌ చేసిన సూచనలతో ఎంతో పురోగతి కనిపిస్తోందని ప్రధాని మోడీ చెప్పారు.
భారత్‌ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక పురోగతి గురించి వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో త్వరలోనే భారత్‌ కీలక భూమిక పోషించనుందన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చటం తమ సంకల్పమన్నారు.