ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్దేశించిన ఎపిఇఎపిసెట్లో అర్హత పొందిన అభ్యర్థులు జులై 24 నుండి ఆగస్టు మూడోతేదీ లోపు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కన్వీనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు మూడతేదీలోపు రిజిస్ట్రేషన్తోపాటు ఫీజు కూడా చెల్లించాలని సూచించారు. జులై 25వ తేదీ నుండి ఆగస్టు నాలుగోతేదీ వరకూ సహాయ కేంద్రాల ద్వారా ధృవపత్రాల పరిశీలన ఉంటుందని, ఆగస్టు మూడోతేదీ నుండి ఎనిమిదో తేదీ వరకూ ఐదురోజులపాటు అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని, 9వతేదీన ఒక్కరోజు మార్పునకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆగస్టు 12న సీట్లు కేటాయింపులు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు 13, 14 తేదీల్లో వ్యక్తిగతంగా సీట్లు పొందిన కళాశాలల్లో రిపోర్టు చేయాలని, ఆగస్టు 16వ తేదీన నుండి తరగతులు ప్రారంభం అవుతాయని వివరించారు. పూర్తి వివరాల కోసం సిఇటిఎస్.ఎపిఎస్సిహెచ్ఇ,ఎపి.జిఓవి,ఇన్ వెబ్సైట్లో సందర్శించాలని కోరారు.










