Oct 27,2023 10:43

జైపూర్‌ : రాజస్థాన్‌లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఎత్తులు వేస్తున్న బిజెపి కేంద్ర దర్యాప్తు సంస్థలను సైతం రంగంలోకి దింపుతోంది. ఎన్నికల వేళ ఒకవైపు ప్రచారం హోరు కొనసాగుతోంటే మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సోదాలను ముమ్మరం చేస్తోంది. విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన (ఎఫ్‌ఇఎంఎ) కేసులో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌ గెహ్లాట్‌కు గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న న్యూఢిల్లీలోని ఇడి ప్రధానకార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. కాగా, ఈ కేసులో ఆగస్టులో జైపూర్‌, ఉదరుపూర్‌, ముంబయి, ఢిల్లీల్లో ఇడి సోదాలు నిర్వహించింది. రాజస్థాన్‌కు చెందిన ట్రిటన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు, ప్రమోటర్లు శివ శంకర్‌ శర్మ, రత్తన్‌ కాంత్‌ శర్మ, ఇతరులకు వ్యతిరేకంగా ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో లెక్క చూపని రూ 1.2 కోట్లను ఇడి స్వాధీనం చేసుకుంది. రత్తన్‌ కాంత్‌ శర్మకు వైభవ్‌ గెహ్లాట్‌కు మధ్య లావాదేవీలు ఉన్నాయని ఆరోపిస్తుంది. ఈ విషయంపైనే వైభవ్‌ గెహ్లాట్‌ను ఇడి ప్రశ్నించి, అతని స్టేట్‌్‌మెంట్‌ను నమోదు చేస్తుందని భావిస్తున్నారు. గతంలో వైభవ్‌కు రత్తన్‌ కాంత్‌ ఒక కార్‌ రెంటల్‌ కంపెనీలో భాగస్వామిగా ఉన్నాడు.
 

                                                                      పిసిసి చీఫ్‌ నివాసంపై ఇడి దాడి

రాజస్థాన్‌ పిసిసి అధ్యక్షులు గోవింద్‌ సింగ్‌ దోతస్రా, మహువా నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి నివాసాలపై గురువారం ఇడి దాడులు నిర్వహించింది. శికార్‌, జైపూర్‌లో ఉన్న గోవింద్‌ సింగ్‌ నివాసాలపై పరీక్ష పేపర్ల లీక్‌కు సంబంధించిన ఒక మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా ఇడి దాడులు నిర్వహించింది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మహువా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న ఓం ప్రకాశ్‌ హుడ్లా, మరికొందరు కాంగ్రెస్‌ నాయకులు నివాసాలపైనా ఇడి దాడులు నిర్వహించింది. కాగా ఎన్నికల్లో పోరాటానికి దర్యాప్తు సంస్థల సహాయాన్ని మోడీ తీసుకుంటున్నారని కాంగ్రెస్‌ విమర్శించింది. ఎన్నికల్లో బిజెపికి ప్రజలు తగిన సమాధానం చెబుతారని తెలిపింది.
           తన కుమారుడికి ఇడి సమన్లు జారీ చేయడంపై అశోక్‌ గెహ్లాట్‌ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే బిజెపి కాంగ్రెస్‌ నాయకులను లక్ష్యంగా చేసుకుందని, దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. గోవింగ్‌ సింగ్‌, ఓం ప్రకాశ్‌ నివాసాలపై ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే ఇడి దాడులు జరిగాయని పేర్కొన్నారు.