- చలామణీకి అవకాశం ఇవ్వొద్దు
- పెద్ద నోటును నిరాకరిస్తున్న వ్యాపారస్తులు
- సెప్టెంబర్ తర్వాత కొనసాగించొచ్చు
- లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో దాదాపు మూడింట రెండు వంతుల మంది వద్ద ఒక్క రూ.2,000 నోటు కూడా లేదని ఓ సర్వేలో వెల్లడయ్యింది. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ఫాం లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో 64 శాతం మంది తమ వద్ద ఒక్కటి కూడా రూ.2,000 నోటు లేదని తెలిపారు. ఆరు శాతం మంది మాత్రం తమ వద్ద రూ.1 లక్ష అంతకంటే ఎక్కువ ఉన్నట్లు వెల్లడించారు. రూ.2000 నోట్లు ఎంత మంది కలిగి ఉన్నారనే దానిపై లోకల్ సర్కిల్ దేశంలోని 341 జిల్లాల్లోని 57,000 పైగా మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇందులో 64 శాతం మంది పురుషులు, మిగిలినవారు మహిళలు ఉన్నారు. రూ.2,000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు మే 19న ఆర్బిఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలు తమ వద్ద ఉన్న ఈ నోట్లను బ్యాంకు శాఖలలో మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. లోకల్ సర్కిల్స్ సర్వే రిపోర్ట్ ప్రకారం.. 15 శాతం మంది వద్ద రూ.20,000 వరకు పెద్ద నోట్లు ఉన్నాయి. ఏడు శాతం మంది వద్ద రూ. 20,000 నుంచి రూ. 40,000 మధ్య, ఆరు శాతం మంది వద్ద రూ.40వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉన్నట్లు తెలిపారు.
రద్దు చేయాలి..
ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటన తర్వాత వ్యాపారస్తులు పెద్ద నోట్ల స్వీకరణకు వెనుకాడుతున్నారు. వినియోగదారులు రూ.2,000 నోటుతో చేసే చెల్లింపులను 91 శాతం మంది వ్యాపారస్తులు నిరాకరిస్తున్నారని లోకల్ సర్వేలో వెల్లడయ్యింది. రిటైల్ దుకాణాలు, కెమిస్ట్లు, ఆసుపత్రులు, సర్వీస్ ప్రొవైడర్లు, పెట్రోలు పంపుల యాజమానుల వద్ద పెద్ద నోటు చలామణీకి ఇబ్బందులు పడుతున్నారని తేలింది. రూ.2,000 నోట్లను ఉపసంహరించుకోవాలని ఆర్బిఐ నిర్ణయించినప్పటికీ.. దీనికి చట్టబద్ధమైన కరెన్సీగా హామీ ఇవ్వడం జరిగింది. అయినా కొందరు వ్యాపారస్తులు నిరాకరించడం గమనార్హం. రూ.2000 నోటు ఉపసంహరణకు 64 శాతం మంది మద్దతు పలకగా.. 22 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. సెప్టెంబర్ 30 తర్వాత కూడా రూ.2,000 నోటు చట్టబద్ధంగా చెల్లుబాటు కావొచ్చని 68 శాతం మంది అభిప్రాయపడ్డారు. అంతే మంది పెద్ద నోటును రద్దు చేయాలని.. చలామణీకి అవకాశం ఇవ్వకుండా.. డిపాజిట్కు మాత్రమే అనుమతించాలని కోరారు. దాంతో నల్లధనం ఉన్న వారు బయటపడుతారని అభిప్రాయపడ్డారు.










