న్యూయార్క్: ఇండియాతో ఉన్న విబేధాలను పక్కనపెట్టి, ఢిల్లీలో జరగబోయే జీ20 సమావేశాల్లో తమ సమస్యలను పరిష్కరించుకోవాలని, ఆ సమావేశాల్లో నిర్మాణాత్మక పాత్రను పోషించాలని చైనాను అమెరికా కోరింది. ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ఈ అభ్యర్థన చేశారు. ఒకవేళ చైనా ఆ సమావేశాలను చెడగొట్టాలనుకుంటే అది ఆ దేశ ఉద్దేశమని జేక్ తెలిపారు. ఢిల్లీలో జరిగే జీ20 సమావేశాలకు అధ్యక్షుడు జిన్పింగ్ వెళ్లడం లేదని చైనా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా ఆ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో 9, 10వ తేదీల్లో జీ20 సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు చైనా ప్రధాని లీ కియాంగ్ హాజరుకానున్నారు.