Feb 03,2023 21:18

న్యూఢిల్లీ : హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ ఆధారంగా అదాని గ్రూపునకు అంతర్జాతీయ సంస్థలు ఒక్కొక్కటిగా వరుస కట్టి షాక్‌ ఇస్తున్నాయి. ఇప్పటికే పలు బ్యాంక్‌లు అదాని కంపెనీలకు బాండ్లపై రుణాల జారీని నిరాకరించగా.. తాజాగా శుక్రవారం అమెరికన్‌ సంస్థ ఎస్‌అండ్‌పి డోజోన్స్‌ తన సస్టెయినిబిలిటీ సూచీ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఫిబ్రవరి 7 నుంచి ఇది అమల్లోకి వచ్చేలా సవరణలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. స్టాక్‌ మార్కెట్‌లో మానిఫ్యులేషన్‌, అకౌంటింగ్‌ మోసాలు, వాటాదారుల విశ్లేషణలు, మీడియా రిపోర్టులు, పలు విశ్లేషణలను ఆధారంగా చేసుకుని అదాని ఎంటర్‌ప్రైజెస్‌ను సస్టెయినిబిలిటీ సూచీ నుంచి తొలగిస్తున్నట్లు డిజోన్స్‌ తన నోట్‌లో పేర్కొంది. ఒక కంపెనీ సామాజిక, ఆర్థిక ప్రగతి ఆధారంగా ఈ సూచీలో గుర్తింపును ఇస్తుంది. ఈ సూచీలో ప్రపంచంలోని అతిపెద్ద 2500 స్టాక్స్‌కు మాత్రమే గుర్తింపు ఉంటుంది. ఇప్పటికే అదాని కంపెనీల షేర్లు అగాథంలో పడిపోతుండగా.. డోజోన్స్‌ నిర్ణయం ఆ కంపెనీ షేర్లను మరింత తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి. దీంతో అదాని ప్రపంచ కుబేరుల జాబితాలో 21వ స్థానానికి పతనమయ్యారు.