May 11,2023 21:00

న్యూఢిల్లీ: ముడి సోయాబీన్‌ చమురు, పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్‌) సీడ్‌ ఆయిల్‌ దిగుమతులపై ప్రాథమిక కస్టమ్స్‌ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్థి సెస్‌ను రద్దు చేస్తున్నట్లు గురువారం కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది. ఈ దిగుమతి సుంకం మినహాయింపు జూన్‌ 30 వరకు అమలులో ఉంటుందని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్‌ రేట్‌ కోటా లైసెన్స్‌ ఉన్న దిగుమతిదారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని వెల్లడించింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ముడి సన్‌ఫ్లవర్‌ సీడ్‌ ఆయిల్‌, ముడి సోయాబీన్‌ ఆయిల్‌కు సంవత్సరానికి 2 మిలియన్‌ టన్నుల వరకు సుంకం రహిత దిగుమతి వర్తిస్తుందని తెలిపింది. కేంద్రం విధించిన పరిమితి దాటితే అధిక సుంకం వసూలు చేస్తారు.