Sep 09,2023 08:43

న్యూఢిల్లీ : యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యుఐడిఎఐ) ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు గడువును మరో మూడు నెలలు పాటు పొడిగించింది. ప్రస్తుతం గడువు సెప్టెంబరు 14తో ముగియనున్న నేపథ్యంలో డిసెంబరు 14 వరకు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆధార్‌ యూజర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు డిసెంబరు 14 వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ఆధార్‌కార్డును అప్‌డేట్‌ చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. మై ఆధార్‌ పోర్టల్‌ ద్వారా ఉచితంగా ఆధార్‌ డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పింది. అలాగే ఆధార్‌ జారీ పదేళ్లు దాటిన వారి వివరాలను మళ్లీ అప్‌డేట్‌ ప్రక్రియను యుఐడిఎఐ ప్రారంభించింది. అడ్రస్‌, వ్యక్తిగత వివరాలు మార్చుకోవాలనునేవారు అందుకు సంబంధించిన ఐడి ప్రూఫ్‌, అడ్రస్‌ ప్రూఫ్‌ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ వివరాలను అప్డేట్‌ చేసుకోవాలంటే ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి రూ.50 వరకు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు 14 వరకు డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌లోనూ ఉచితంగానే ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకోవచ్చు.