
విజయనగరం : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా ఆలోచించి రాష్ట్రాన్ని రివర్స్ గేర్ లో నడిపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు గణపతినీడి శ్రీనివాసరావు ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ... గణపతి నీడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రివర్స్ గేర్ లో ఏపీ అనే వినూత్న కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. రివర్స్ గేర్ లో ఏపీ పేరిట నగరంలోని మయూరి జంక్షన్ నుండి బాలాజీ జంక్షన్ మీదుగా కోట జంక్షన్ వరకు రివర్స్ లో పాదయాత్ర కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ... గత నాలుగున్నర ఏళ్లలో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో తెలియజేయడానికి రివర్స్ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిన విషయాన్ని గమనించి ప్రజలు మేలుకోవాలన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. రోజులకొద్ది న్యాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కానీ చంద్రబాబును ఇంకా విడుదల చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు రావాలని ప్రజలు మద్దతు తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ కూడా ఉన్న ఏపీ ప్రజలు చంద్రబాబు కోసం మద్దతు గళాన్ని వినిపిస్తున్నారని స్పష్టం చేశారు. త్వరలోనే చంద్రబాబు జైలు నుంచి బయటకు రావాలని కోరారు. తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ కార్యదర్శి ఐవిపి రాజు మాట్లాడుతూ ... చంద్రబాబును అరెస్టు చేసి 45 రోజులు అవుతుందన్నారు. గత నాలుగున్నర ఏళ్లలో పోలవరం, పరిశ్రమలు, అభివఅద్ధి అన్ని కూడా రివర్స్ లోనే ఉన్నాయన్నారు. సైకో సిఎంకు తగిన బుద్ధి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కనకల మురళీమోహన్, బద్దుల నరసింగరావు, కర్రోతు నర్సింగరావు టిడిపి న్యాయవిభాగం నాయకులు ఉపాధ్యాయుల రవిశంకర్, తెలుగు యువత నాయకులు సురేంద్ర, చైతన్య, ప్రవీణ్, టిడిపి నాయకులు కుటుంబరావు, కిలాని మహేష్, కే.చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.