వాష్టింగ్టన్ : ప్రజల ఉపాధి, ఉనికికే ముప్పు తెచ్చిపెట్టే కృత్రిమ మేధస్సు (ఎఐ) అభివృద్థి, ప్రయోగాలను ఆపాలని ప్రపంచంలోని 1000 మంది నిపుణులు కోరారు. ఎఐని నిలిపివేయాల్సిన అవసరం ఉందని ట్ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్, ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ సహా 1,000 మంది నిపుణులు తమ సంతకాలతో 'పాజ్ జియాంట్ ఎఐ ఎక్స్పెర్మెంట్స్' పేరిట బహిరంగ లేఖ విడుదల చేశారు. దీన్ని 'ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఇన్స్టిట్యూట్' తరఫున విడుదల చేశారు. సంతకం చేసిన వారిలో చాట్జిపిటిని విమర్శిస్తున్న ప్రముఖులతో పాటు ఓపెన్ఎఐ ప్రత్యర్థి సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇటీవల ఎఐ ఆధారిత చాట్బాట్ చాట్జిపిటిని అభివఅద్ధి చేసిన ఓపెన్ఎఐ సంస్థ ఇటీవల జిపిటి-4 పేరిట మరింత అత్యాధునిక ఎఐ వ్యవస్థను ఆవిష్కరించింది. ఇది మొత్తం సమాజానికి తీవ్ర ప్రమాదాన్ని తలపెట్టే అవకాశం ఉందని నిపుణులు తమ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కల్పించుకుని ఎఐ వ్యవస్థల అభివృద్థిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.










