Oct 14,2023 15:34

ఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా ఆప్‌ ఎంపి  సంజయ్ సింగ్‌ కోర్టు హాల్‌లో రాజకీయ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా సంజరుసింగ్‌కి ఢిల్లీకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆప్‌ ఎంపి తన వాదనలు వినిపించే క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ, దేశ ప్రధాని నరేంద్ర మోడీల పేర్లు ప్రస్తావించారు. దీనికి కోర్టు సింగ్‌కి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా సంబంధం లేని విషయాలు గురించి మాట్లాడకూడదని కోర్టు సింగ్‌ని హెచ్చరించింది. మరోసారి ఇలా చేస్తే నేరుగా కాకుండా.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే వాదనలు జరుగుతాయని ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు.
అయితే ఢిల్లీ కోర్టులో సంజరుసింగ్‌ ఈడీని ఆరోపించారు. తాను గౌతమ్‌ అదానీపై ఫిర్యాదు చేసినప్పటికీ... ఈ విషయంపై దర్యాప్తు సంస్థలు పనిచేయడం లేదని సింగ్‌ ఆరోపించారు. ఈడీ అధికారులు కూడా దర్యాప్తులో 'నా తల్లి నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నావు. నా భార్యకు పదివేల రూపాయలు ఎందుకు పంపావు. వంటి అనవసరమైన ప్రశ్నల్ని ఈడీ ప్రశ్నించింది. అనవసరమైన ప్రశ్నలతో ఈడీ ఓ ఎంటర్టఐన్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌గా మారింది. ఈడీ చెప్పేవన్నీ అబద్ధాలే. అదానీపై నేను ఫిర్యాదు చేశాను. కానీ ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు.' అని సంజరుసింగ్‌ అన్నారు. శనివారం ఢిల్లీ కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మరో రెండు వారాలు రిమాండ్‌ పెంచాలని ఈడీ అభ్యర్థించింది. ఈ మేరకు న్యాయస్థానం అక్టోబర్‌ 27 వరకు సంజరు సింగ్‌ రిమాండ్‌ను పొడిగించింది.