Jul 18,2023 17:26

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టులో 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటిదాకా 9 మంది ప్లేయర్లు మాత్రమే 500లకు పైగా అంతర్జాతీయ మ్యాచులు ఆడారు.. ఈ లిస్టులో మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ టాప్‌లో ఉన్నాడు. శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేళ జయవర్థనే, కుమార సంగర్కర, సనత్‌ జయసూర్య, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ, పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిదీ, సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జాక్వస్‌ కలీస్‌, రాహుల్‌ ద్రావిడ్‌ ఉన్నారు. వారి తరువాత విరాట్‌ కోహ్లీ, వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టుతో 500 అంతర్జాతీయ మ్యాచులు పూర్తి చేసుకోబోతున్నాడు. ఇప్పటిదాకా 110 టెస్టులు, 274 వన్డేలు, 115 టీ20 మ్యాచులు ఆడిన విరాట్‌ కోహ్లీ, 500లకు పైగా మ్యాచులు ఆడిన ప్లేయర్లలో మూడు ఫార్మాట్లలో 100కి పైగా మ్యాచులు ఆడాడు.