న్యూఢిల్లీ : విదేశీ జైళ్లలో 8,300 మంది భారత ఖైదీలు మగ్గుతున్నారని విదేశాంగశాఖ వెల్లడించింది. ఇందులో యుఎఇ, సౌదీ అరేబియా, కువైట్ తదితర గల్ఫ్ దేశాల్లోనే ఎక్కువ మంది ఉన్నారని తెలిపింది. విదేశాల్లోని భారత ఖైదీల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని విదేశాంగశాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ చెప్పారు. ఈ ఖైదీలను విడుదల చేసి, స్వదేశానికి రప్పించేందుకు అక్కడి ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ, యుఎఇలోని జైళ్లలో 4,630 మంది భారత ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఇందులో అత్యధికంగా యుఎఇలో 1,611 మంది, సౌదీలో 1,461, ఖతార్లో 690 మంది ఖైదీలు ఉన్నట్టు పేర్కొన్నది.










