న్యూఢిల్లీ : దాదాపు మూడువంతుల మందిలో ఉద్యోగ అభద్రత నెలకొంది. హెచ్ఆర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయినా జీనియస్ కన్సల్టెంట్స్ సర్వే ప్రకారం... ఉద్యోగ భద్రతపై 71 శాతం మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు పొదుపు చర్యలను పాటించడం ద్వారానే తొలగింపులకు పాల్పడుతున్నాయని 30 శాతం మంది పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యాన్ని బూచిగా చూపి ఉద్వాసనలు పలుకుతున్నాయని మరో 23 శాతం మంది అభిప్రాయపడ్డారు. అధిక నియామకాలు కూడా తీసివేతలకు కారణమని మరో 36 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఫైనాన్స్, ఇంజనీరింగ్, ఇ-ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసిజి, హాస్పిటాలిటీ తదితర అన్ని రంగాల్లోని 1,537 మందిని ఈ సర్వేలో భాగస్వామ్యం చేసినట్లు జీనియస్ కన్సల్టెంట్స్ తెలిపింది. ''అందుబాటులో ఉన్న మానవ వనరులతో తమ శ్రామిక శక్తిని సమతుల్యం చేసుకోవడానికి కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అనేక సంస్థలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఖర్చులను తగ్గించడం ద్వారా తమ లాభదాయకతను మెరుగుపరచుకోవాలని భావిస్తున్నాయి. సాంకేతిక పురోగతి, భౌతిక లేబర్పై తక్కువ ఆధారపడటం ద్వారా తొలగింపులు చోటు చేసుకుంటున్నాయని 11 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుత తొలగింపుల నేపథ్యంలో తమ సంస్థలో ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నట్లు 57 శాతం మంది పేర్కొంది. అనిశ్చితిని నివారించడానికి ఉద్యోగులను మార్చుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయని 83 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ గందరగోళం నుంచి బయటపడటానికి సొంత వ్యాపారాన్ని పెట్టుకోవాలని భావిస్తున్నామని 5 శాతం మంది పేర్కొన్నారు.'' అని ఈ రిపోర్ట్ పేర్కొంది. ''ప్రస్తుత తొలగింపుల ప్రక్రియలు ఉద్యోగులలో చాలా ఆందోళనలు కలిగిస్తోందని స్పష్టమవుతోంది. అటువంటి పరిస్థితులను నివారించడానికి సంస్థలు మెరుగైన శ్రామిక శక్తి ప్రణాళిక, నిర్వహణ వ్యూహాలు, అలాగే తమ ఉద్యోగులతో మంచి సంబంధాలు, పారదర్శకతను కలిగి ఉండాలి.'' అని జీనియస్ కన్సల్టెంట్స్ సిఎండి ఆర్పి యాదవ్ తెలిపారు.










