Aug 09,2023 17:27

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు. దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్‌ రూపంలో బీసీసీఐపై కోట్ల వర్షం కురుస్తోంది. వివిధ రూపాల్లో ప్రతీ ఏడాది బోర్డుకు వేల కోట్లలో ఆదాయం సమకూరుతోంది. అంతే స్థాయిలో బోర్డు ప్రభుత్వానికి ఆదాయ పన్ను కడుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ రూ. 1,159 కోట్ల పన్ను కట్టింది. అంతకుముందు ఏడాది కంటే అది 37 శాతం ఎక్కువ కావడం విశేషం. 2020-21లో రూ. 844.92 కోట్ల ఆదాయ పన్ను కట్టింది. ఈ మేరకు రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇక, 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐకి రూ. 7,606 కోట్ల ఆదాయం లభించింది. అందులో 3,064 కోట్లను బోర్డు ఖర్చు చేసింది. 2020-21లో 4,735 కోట్ల ఆదాయం సమకూరగా అందులో 3,080 కోట్లు వివిధ పనుల కోసం ఖర్చయ్యాయి.