Dec 03,2022 08:21
  • సగానికిపైగా కంప్యూటర్లు పనిచేయటం లేదు : ఎడ్యుకేషన్‌ ప్లస్‌ నివేదిక

న్యూఢిల్లీ : ప్రయివేటు స్కూళ్లలో కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ కనెక్షన్లు ఉండి.. ప్రభుత్వ స్కూళ్లలో లేకపోతే అది సమాజంలో డిజిటల్‌ అంతరాలకు దారితీస్తుంది. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేని ప్రభుత్వ స్కూళ్లు 66 శాతం ఉన్నాయి. కేరళలో మాత్రం.. ఇంటర్నెట్‌ కనెక్షన్‌, కంప్యూటర్లు ఉన్న ప్రయివేట్‌ స్కూల్స్‌ కన్నా ప్రభుత్వ స్కూల్స్‌ ఎక్కువని 'ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ' విడుదల చేసిన 'ఎడ్యుకేషన్‌ ప్లస్‌-2021-22' నివేదిక చెబుతోంది. డిజిటల్‌ బోధనలో (కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌, స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌) కేరళ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అక్కడ 94.6 శాతం ప్రభుత్వ స్కూల్స్‌కు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉందని ఈ సర్వే తేల్చింది. డిజిటల్‌ బోధనలో ఢిల్లీ, లక్షద్వీప్‌, గుజరాత్‌, చండీగఢ్‌, పంజాబ్‌, హర్యానా.. ముందుండగా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకాశ్మీర్‌, మధ్యపదేశ్‌, మణిపూర్‌, పశ్చిమ బెంగాల్‌, మేఘాలయ, ఒడిషా, తెలంగాణ, త్రిపుర చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేని ప్రభుత్వ స్కూళ్లు 80 నుంచి 85 శాతం ఉన్నాయని సర్వే తెలిపింది.

                                                                  డిజిటల్‌ బోధనలో కేరళ టాప్‌..

  • 94.6శాతం ప్రభుత్వ స్కూళ్లలో ఇంటర్నెట్‌ కనెక్షన్‌

కేరళ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అక్కడ ఇంటర్నెట్‌ కనెక్షన్లున్న ప్రయివేటు స్కూల్స్‌ కన్నా ప్రభుత్వ సూల్స్‌ ఎక్కువ. తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. ఇంటర్నెట్‌ వసతి లేని స్కూల్స్‌ బీహార్‌లో 92శాతం, మిజోరాంలో 90శాతం ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, లక్షద్వీప్‌ల్లోని అన్ని ప్రభుత్వ స్కూల్స్‌లో కంప్యూటర్లున్నాయి. ఇంటర్నెట్‌ కనెక్షన్లతో వాడుతున్నవి 97.4శాతం ఉన్నాయి. ఇంటర్నెట్‌ కనెక్షన్లున్న స్కూల్స్‌ చండీగఢ్‌లో 98.7శాతం, పాండిచ్చెరిలో 98.4శాతం ఉన్నాయని సర్వే తెలిపింది. మొత్తంగా దేశవ్యాప్తంగా చూస్తే.. 59.6శాతం ప్రయివేటు, అన్‌ఎయిడెడ్‌, 53.1శాతం గవర్నమెంట్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌, 24.2 శాతం ప్రభుత్వ స్కూల్స్‌కు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంది. కంప్యూటర్ల వాడకమున్న స్కూల్స్‌ 50శాతం లోపే. టీచింగ్‌ కోసం ఇచ్చిన మొబైల్స్‌లో 20శాతం పనిచేస్తున్నాయి.
         పాఠశాల విద్యా బోధనలో డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం.. కీలకంగా మారాయి. కేరళ, పంజాబ్‌, హర్యానా, గుజరాత్‌ రాష్ట్రాల్లో 90శాతానికిపైగా ప్రభుత్వ స్కూల్స్‌లో స్మార్ట్‌రూమ్‌ బోధన ఉందని సర్వే వెల్లడించింది. దేశంలోని 14 లక్షల స్కూల్స్‌లో స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌ ఉన్నవి 2,22,155 మాత్రమే. డిజిటల్‌ బోధన, స్మార్ట్‌ బోర్డ్స్‌ ద్వారా టీచింగ్‌ ఈ స్కూల్స్‌లో కొనసాగుతోంది. తమిళనాడులో స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌ ఉన్నవి జీరో. కంప్యూటర్ల గురించి స్కూల్‌ పిల్లలకు చెప్పాలన్నా, డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌లో బోధన ముందుకు సాగాలన్నా.. ఇంటర్నెట్‌ చాలా ముఖ్యం. ప్రయివేటు పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాలంటే కంప్యూటర్లు, వాటి వాడకం అందుబాటులో ఉండాలి. కేరళ, గుజరాత్‌, ఢిల్లీ, లక్షద్వీప్‌ తదితర రాష్ట్రాలతో పోల్చితే ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌.. మొదలైనవి చాలా వెనుకబడి ఉన్నాయి.