Apr 27,2023 21:02

సిటీ బ్యాంక్‌ స్వాధీనంతో ప్రభావం
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని యాక్సిస్‌ బ్యాంక్‌ గడిచిన ఆర్థిక సంవత్సరం (2022ా23) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.5,728.42 కోట్ల నికర నష్టాలు చవి చూసింది. సిటీ బ్యాంక్‌ ఇండియా కన్స్యూమర్‌ బిజినెస్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మార్చి1న యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఇందుకోసం రూ.11,603 కోట్లు చెల్లించింది. ఆ సంస్థ స్వాధీనానికి చెల్లింపులు చేయడంతో నష్టాలు చవి చూసింది. ఇంతక్రితం 2021ా22 క్యూ4లో రూ.6,625 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ4లో యాక్సిస్‌ బ్యాంక్‌ నికర వడ్డీపై ఆదాయం 33 శాతం పెరిగి రూ.11,742 కోట్లకు చేరింది. డిపాజిట్లు 15 శాతం పెరిగినట్లు తెలిపింది. బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 2.38 శాతం నుంచి 2.02 శాతానికి తగ్గాయని వెల్లడించింది. గడిచిన క్యూ4లో ఏడాదికేడాదితో పోల్చితే రుణాల జారీలో 19 శాతం వృద్థిని కనబర్చింది. దేశీయ రుణాల విభాగంలో 23 శాతం పెరుగుదల నమోదయ్యింది. రిటైల్‌ రుణాల్లో 22 శాతం వృద్థి సాధించింది. బ్యాంక్‌ బ్యాలెన్ష్‌ షీట్‌ 12 శాతం పెరిగి రూ.13,17,326 కోట్లకు చేరింది. 2022ా23కు గాను బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.1 డివిడెండ్‌ను ప్రకటించారు. గురువారం బిఎస్‌ఇలో యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్‌ 0.76 శాతం తగ్గి రూ.881.05 వద్ద ముగిసింది.